‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ అనే ఓ మోటు సామెత వర్తమాన రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్ ప్రభుత్వ హయాంలో టిడిపి నేతలు, కార్యకర్తలను వైసీపి నేతలు ఎంతగా వేధించారో అందరికీ తెలుసు. వల్లభనేని వంశీ అనుచరులు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన పట్టపగలు గన్నవరంలోని టిడిపి కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వాహనాలకు నిప్పు పెట్టారు.
వారిని టిడిపి సీనియర్ నేత పట్టాభి అడ్డుకోబోతే, పోలీసులు ఆయనపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ టిడిపి కార్యాలయంపై దాడి చేసిన వంశీ అనుచరులను, వారిని ప్రోత్సహించి పంపిన వంశీపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
అది అప్పటి కధ. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది. కనుక ఇప్పుడు వల్లభనేని వంశీతో సహా ఆనాడు టిడిపి కార్యాలయంపై దాడి చేసిన మొత్తం 71 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 15మందిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. వంశీతో సహా మిగిలినవారిని కూడా పోలీసులు త్వరలో అరెస్ట్ చేయనున్నారు.
ఆనాడు వంశీ అనుచరులు గన్నవరంలో టిడిపి కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టినప్పుడు అవన్నీ సిసి కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. కానీ అప్పుడు పోలీసులకు అవేవి లభించలేదు! కానీ పట్టాభిరామ్ వారితో గొడవపడుతున్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెపుతూ ఆయనను అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. వంశీ వలన తన భర్త ప్రాణాలకు ప్రమాదం కూడా ఉందని పట్టాభిరామ్ భార్య ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
ఆరోజు ఉన్న పోలీసులే నేడు కూడా ఉన్నారు. ఆరోజు సిసి కెమెరాలలో రికార్డ్ అయిన సాక్ష్యాధారాలే ఇప్పుడూ ఉన్నాయి. కానీ అప్పుడు పోలీసులు పాటించుకోలేదు. వల్లభనేని వంశీ అనుచరుల ఆగడాలకు సంబందించి సాక్ష్యాధారాలు లభించలేదు. కానీ ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలన్నీ లభించాయి. వారు నేరం చేసిన్నట్లు కూడా పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అంటే పోలీసులు చట్టప్రకారం పనిచేయరా?అధికార పార్టీ నేతల కన్నుసన్నలలోనే పని చేస్తుంటారా?అనే సందేహం కలుగకమానదు.
ఏది ఏమైనప్పటికీ, పదవీ, అధికారం ఉంది కదా అని లేదా ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటామనే భ్రమతో రెచ్చిపోతే, అవి పోయినప్పుడు ఏమవుతుందో గ్రహించేందుకు ఈ కేసే ఓ చిన్న నిదర్శనం.
వైసీపిలో వల్లభనేని వంశీ ఒక్కరే కాదు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు దిగువ స్థాయి వరకు అందరూ ఇదే విదంగా వ్యవవరించారు. కనుక అందరూ ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పదు.




