టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మూడేళ్ళ క్రితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అంటూ 2021, ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత ఓ సారి స్వయంగా స్పీకర్ని కలిసి తన రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరారు కూడా.
అప్పుడు ఆమోదించలేదు… కానీ మూడేళ్ళ తర్వాత ఇప్పుడు ఆమోదించి గంటా శ్రీనివాసరావుకి జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది!
గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, “మూడేళ్ళ క్రితం రాజీనామా చేస్తే ఎన్నికలకు మూడు నెలల ముందు ఆమోదించడం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత అభద్రతాభావంతో ఉన్నారో అర్దమవుతోంది. ఆయన తన పార్టీలోనే 50 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారని భయపడుతున్నారు. జగన్ ఇంత పిరికివారని నేను అనుకోలేదు. నా రాజీనామాను స్పీకర్ ఆమోదించినప్పటికీ, నేను నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి నాకున్న అవకాశాల గురించి న్యాయనిపుణులతో సంప్రదిస్తాను. నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా టిడిపి అభ్యర్ధికే వేస్తాను,” అని అన్నారు.
వైసీపి నుంచి సస్పెండ్ చేయబడినవారు, పార్టీని వీడినవారు కలిపి మరో 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వారికి కూడా ‘మీపై అనర్హత వేటు ఎందుకు వేయరాదో వారం రోజులలోగా సంజాయిషీ ఇవ్వాలని’ కోరుతూ స్పీకర్ నోటీసులు పంపారు.
ఇప్పుడే ఎందుకంటే, ఏప్రిల్ నెలలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. వైసీపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీలో చేరిన టిడిపి ఎంపీ సిఎం రమేష్ ముగ్గురి పదవీకాలం ఏప్రిల్కు 2వ తేదీతో ముగుస్తుంది.
ఒక్కో ఎంపీ అభ్యర్ధి గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆ లెక్కన మూడు సీట్లు వైసీపి దక్కించుకోవాలంటే మొత్తం 132 మంది ఎమ్మెల్యేలు అవసరం. వైసీపికి 151 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ వారిలో 8మంది బయటకు వెళ్ళిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిల మార్పులు చేర్పుల కారణంగా మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారు.
అయినప్పటికీ మిగిలిన ఎమ్మెల్యేలతో వైసీపి ముగ్గురు ఎంపీ అభ్యర్ధులను గెలిపించుకోగలదు. కానీ వైసీపిని వీడినవారు, వీడబోతున్నవారి వలన టిడిపి ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకూడదనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు హటాత్తుగా ఎమ్మెల్యేలకు నోటీసులు పంపుతున్నట్లు అర్దమవుతోంది.
తెలుగులో ఓ నానుడి ఉంది. “నాకు ఓ కన్నుపోయినా పర్వాలేదు కానీ ఎదుటవాడివి రెండు కళ్ళూ పోవాలని కోరుకొన్నట్లు”గా ఉంది వైసీపి వ్యవహారం. వైసీపిలో 8 మంది ఎమ్మెల్యేలు పోగా ఇంకా 143మంది ఉన్నారు. వారితో ముగ్గురు ఎంపీలను గెలిపించుకోవచ్చు. అయినా టిడిపికి అవకాశం దక్కకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్దమవుతోంది.




