నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఈ యూనివర్శిటీలో సమస్యలు ఉన్న విషయం వాస్తవమేనని, దీంతో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
వర్శిటీ వైస్ ఛాన్స్ లర్ వీరయ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించిన గంటా, యూనివర్శిటీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు మాట నిజమే అయినా, అందులో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయని, వారం రోజుల్లో కొత్త యూనివర్శిటీలో పరిపాలన, తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాగా, ఇటీవల పలు విద్యార్థి సంఘాల నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి విక్రమ సింహపురి యూనివర్శిటీలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, తాజాగా మంత్రి గంటా ఆ యూనివర్శిటీకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.



