విశాఖ ఉక్కు కొత్త ట్విస్ట్! ఆదానీ కోసమా… కేసీఆర్‌ కోసమా?

Gautam Adani KCR Vizag Steelవైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ దానిలో పనిచేస్తున్న కార్మికులు ఏడాదిన్నరగా పోరాడుతున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ వారం రోజుల క్రితం కేసీఆర్‌ ఎంట్రీతో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయిపోయింది. దానిపై ఇటు ఏపీ, తెలంగాణ మంత్రుల మద్య, అక్కడ తెలంగాణలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీల మద్య భీకర యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ వాటి పోరాటలతో ‘వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌’కు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. అన్ని పార్టీలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో రాజకీయ మైలేజీ, రాజకీయ ఆదిపత్యం కోసం పోరాడుకొంటుండటమే ఇందుకు కారణం.

ADVERTISEMENT

అయితే ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నా ఉద్యోగమేళాలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్‌ కులస్తే, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణపై ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

ప్రస్తుతం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ దిశలో ముందుకు సాగాలనుకోవడం లేదని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌ను ముడిసరుకు అందించి ఏవిదంగా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నామన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో తెలంగాణ ప్రభుత్వం లేదా సింగరేణి పెట్టుబడులు పెట్టడం ఓ రాజకీయ ఎత్తుగడ అని, అంతా భూటకమని ఫగన్ సింగ్‌ కులస్తే అన్నారు. ఈ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందా లేదా అనేది దానిష్టమని అన్నారు.

అంటే కేసీఆర్‌ ఎంట్రీతో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందనుకోవచ్చు లేదా కేసీఆర్‌ కారణంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రియా మిత్రుడు ఆదానీకి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ దక్కకుండాపోయే ప్రమాదం ఉందని వెనక్కు తగ్గి ఉండవచ్చు లేదా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడే పేరుతో కేసీఆర్‌ ఏపీలో బలపడితే జాతీయస్థాయిలో బిజెపికి నష్టం కలిగిస్తారని భయపడుతుండవచ్చు.

కారణం ఏదైనప్పటికీ ప్రయివేటీకరణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం తొందరపడదలచుకోలేదని స్పష్టమయ్యింది. కానీ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం దానిష్టం అని ఫగన్ సింగ్‌ కులస్తే చెప్పిన్నందున నెమ్మదిగా అయినా ఈ ప్రక్రియను ముందుకే తీసుకువెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్దమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories