రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఆయనను బుజ్జగించడంతో చల్లబడ్డారు. కానీ ఇప్పుడు జిల్లాలోని గిద్దలూరు వైసీపీ ఎంపీ అన్నా రాంబాబు అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు.
“గత ఎన్నికలలో తాను 80 వేల భారీ మెజార్టీతో గెలిచానని, అప్పటి నుంచే తన సీటుపై పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతల కన్ను పడిందన్నారు. ఈసారి వారు పోటీ చేయాలనుకొంటున్నారని అన్నారు. వారు అలా కోరుకోవడంలో తప్పు లేదు కానీ తన గురించి, తన కులం గురించి దుష్ప్రచారం చేస్తుండటం, జగన్కు పిర్యాదులు చేస్తుండటం చాలా బాధాకలిగిస్తోందని అన్నారు.
ఒకవేళ జగన్ మళ్ళీ తనకే టికెట్ ఇస్తే ఎన్నికలలో పోటీ చేసినా పార్టీలోవారే తనను ఓడించేందుకు ప్రయత్నిస్తారేమో అని అన్నా రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాలలో వచ్చిన చాలామంది భారీగా సంపాదించుకొని ఆస్తులు పోగేసుకొన్నారని, కానీ తాను మాత్రం చాలా నష్టపోయానని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ పోటీ చేయడం… చేసి ఇంకా నష్టపోవడం అవసరమా?అని ఆలోచిస్తున్నానని,” అన్నా రాంబాబు అన్నారు.
ఇక ప్రకాశం జిల్లాలోనే పర్చూరు వైసీపీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు (అన్న) ఆమంచి స్వామి త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. వచ్చే ఎన్నికలలో తాను జనసేన పార్టీ తరపున గిద్దలూరు నుంచి పోటీ చేయబోతున్నట్లు కూడా ఆయనే ప్రకటించేశారు. అంటే ప్రకాశం జిల్లా వైసీపీలో ఇంకా నిప్పు రాజుకొంటూనే ఉందని అర్దమవుతోంది.
ఇక నంద్యాల జిల్లా నంది కొట్కూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్దర్, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిల మద్య గత కొంతకాలం కోల్డ్ వార్ సాగుతోంది. తాను దళిత ఎమ్మెల్యే అయినందునే బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని, కానీ తన సహనానికి హద్దు ఉంటుందని గుర్తించాలని ఎమ్మెల్యే ఆర్దర్ హెచ్చరించారు.
రెండు రోజుల క్రితమే విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసేసారు. తాను జనసేనలో చేరిపోతున్నట్లు ప్రకటించారు. ఈసారి తాను పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. ఒకవేళ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్కు జగన్ మళ్ళీ టికెట్ ఇస్తే, ఇంతకాలం జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా వ్యవహరించిన పంచకర్ల రమేష్ బాబుతోనే పోటీ పడాల్సి ఉంటుంది.
ఇక నెల్లూరు వైసీపీలో నుంచి ఒకేసారి ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలను బయటకు పంపించేసిన తర్వాత కూడా అలజడి తగ్గలేదు. గత కొంత కాలంగా మాజీ మంత్రి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి, ఆయన సొంత బాబాయ్, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్కి మద్య రాజకీయ ఆధిపత్య పోరుసాగుతోంది. ఇటీవల అనిల్ కుమార్ యాదవ్ను తాడేపల్లికి పిలిపించుకొని జగన్ క్లాసు పీకాల్సి వచ్చింది.
ఈవిదంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీ నేతల మద్య కీచులాటలు సాగుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలలో ఇటువంటి అంతర్గత కుమ్ములాటలు సహజమే కావచ్చు. కానీ పార్టీలో ఇటువంటి అనారోగ్య వాతావరణం నెలకొని ఉంటే 175 సీట్లు ఏవిదంగా గెలుచుకొంటారో జగన్కే తెలియాలి.



