ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కి మారిన తర్వాత ఈ రెండేళ్ళలోనే రాష్ట్రానికి సుమారు రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.
తాజాగా గోవా కేంద్రంగా పనిచేస్తున్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ ‘గోవా షిప్యార్డ్ లిమిటెడ్’ ఆంధ్రప్రదేశ్లో రూ. 8,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మచిలీపట్నంలో 400 ఎకరాలు భూకేటాయింపు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ సంస్థ మొదటి దశలో 195 ఎకరాలలో షిప్ యార్డ్ నిర్మించి దానిలో యుద్ధ నౌకలు తయారుచేస్తుంది. మొదటి దశ నిర్మాణ పనులు జనవరి 2028కి పూర్తిచేసి మే నెల నుంచి యుద్ధ నౌకల తయారీ మొదలుపెడుతుంది. దీనిలో 120 (సుమారు 3,600 అడుగులు) పొడవైన భారీ యుద్ధ నౌకలను తయారు చేస్తారు.
మచిలీపట్నంలో ఏర్పాటు కాబోతున్న ఈ షిప్ యార్డ్ ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా మరో 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొదటి దశ ఉత్పత్తి పనులు ప్రారంభం కాగానే వెంటనే రెండో దశ నిర్మాణ పనులు మొదలుపెడుతుంది.
గోవా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో షిప్యార్డ్ ఏర్పాటు చేయడానికి మూడు ప్రధాన కారణాలు. 1. ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన సముద్రతీరం కలిగి ఉండటం 2. ఏటా వర్షాకాలంలో గోవాలో పనులకు ఆటంకం కలుగుతుండటం 3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం స్పీడ్ ఆఫ్ బిజినెస్.
విశాఖలో టీసీఎస్ కంపెనీ రూ.1,370 కోట్ల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసుకుంటోంది. దీనిలో సుమారు 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
మరో ప్రముఖ ఐటి కంపెనీ కాగ్నిజెంట్ కూడా రూ.1583 కోట్ల పెట్టుబడితో విశాఖలో ఏర్పాటు కాబోతోంది. ఈ కంపెనీలో 8,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కూడా విశాఖలో ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో రూ.172.84 కోట్ల పెట్టుబడితో బాబా రాందేవ్కు చెందిన ‘పతంజలి’ ఆహార మరియు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమని నెలకొల్పబోతోంది. రెండేళ్ళలో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాది కల్పిస్తామని బాబా రాందేవ్ చెప్పారు.
అమెరికాకు చెందిన ఎగ్జామ్బిల్ కంపెనీ ప్రతినిధులు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టుకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్లో పర్యటించారు. అక్కడ రూ.85,000 కోట్ల పెట్టుబడితో ప్లాస్టిక్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపుతోంది.
ఉత్తరాంధ్రా జిల్లాలో రాబోతున్న పరిశ్రమలు, ఐటి కంపెనీల వివరాలలో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలానే ఉన్నాయి. ఇవి కాక రాయలసీమ జిల్లాలలో డజన్ల కొద్దీ పరిశ్రమలు ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన తర్వాత అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్కు పరిశ్రమలు, పెట్టుబడులు రావడం పెద్ద విశేషం కాదు. కానీ విభజన తర్వాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కు కేవలం రెండేళ్ళలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, పోర్టులు, షిప్ యార్డులు రావడం మామూలు విషయం కాదు..కదా?





