గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం తదితర జాతీయ దినోత్సవాలను దేశ ప్రజలు సంతోషంగా నిర్వహించుకుంటారు. ఇప్పుడు అలాంటిదే మరో కొత్త పండగ వచ్చింది. అదే… సర్కారు వారి జీఎస్టీ పండగ!
దసరా పండుగకు ముందు జీఎస్టీ స్లాబులు కుదించినందున, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల ధరలు భారీగా తగ్గిపోయాయని, కనుక సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలిగిందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఏపీలోని కూటమి ప్రభుత్వంతో పాటు బీజేపి పాలిత రాష్ట్రాలలో పండగ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి.
అయితే ప్రజలకు నిజంగా అంత మేలు కలుగుతుంటే పండగ చేసుకోమని బొట్టు పెట్టి చెప్పాలా? వారే సంతోషంగా జీఎస్టీ పండగ చేసుకుంటారు కదా? అంటే ‘చేసుకోరు కనుకనే నొక్కి చెప్పాల్సివస్తోందని’ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఏపీలో ఈ జీఎస్టీతో ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో ఊరూవాడా సభలు, సమావేశాలు, హోర్డింగులు పెట్టి, ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేసి వివరించాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీఎస్టీ హడావుడి మొదలైపోతుంది.
గత పదేళ్ళుగా జీఎస్టీ పేరుతో దేశ ప్రజల ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు కాస్త తగ్గించి పండగ చేసుకోమని హుకుం జారీ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఈ బలవంతపు జీఎస్టీ పండగ దేనికిప్పుడు?
ప్రజలకు నిజంగా మేలు చేయాలనుకుంటే పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ రద్దు చేయవచ్చు కదా? వాటి ధరలు తగ్గితే సరుకు రవాణా, ప్రజా రవాణా చార్జీలు తగ్గుతాయి కదా? వాటితో నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా తగ్గుతాయి కదా? కానీ నేటికీ వాటిపై ప్రజల ముక్కుపిండి జీఎస్టీ వసూలు చేస్తూనే ఉన్నాయి కదా?
జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంత లబ్ధి కలుగుతోందో తెలీదు కానీ ఈ పేరుతో కేంద్ర రాష్ట్ర భుత్వాలు ప్రచారం కోసం వేలకోట్లు ఖర్చు చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అయినా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా డబ్బు పంచి ఎంతో మేలు చేశామని చెప్పిన పార్టీలనే ప్రజలు తిరస్కరించినప్పుడు, జీఎస్టీ తగ్గించామని ప్రచారం చేసుకుంటే గెలిపిస్తారనుకోవడం అత్యాశ కాదా?




