కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను 5,12 శాతానికి పరిమితం చేయడం, వివిద ఉత్పత్తులను, సేవలను వీటి పరిధిలోకి తీసుకురావడం చాలా హర్షణీయమే. వీటితో ఏవో అద్భుతాలు జరిగిపోతాయనుకోనవసరం లేదు.
జీఎస్టీ స్లాబులు సవరించి, వివిధ ఉత్పత్తులు, సేవలను వాటి పరిధిలోకి తీసుకువచ్చినా మళ్ళీ పెరిగే ధరలని ఎవరూ ఆపలేరు.
ఉదాహరణకి బ్రెడ్, పరాటా వంటి కొన్ని రకాలైన ఆహార పదార్ధాలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించామని లేదా తక్కువ స్లాబులోకి మార్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కనుక ఇకపై వాటి ధరలు తగ్గుతాయన్నారు.
ఉదాహరణకు ఒక బ్రెడ్ తయారు చేయాలంటే మైదా వంటి ఒక డజను ముడిసరుకులు అవసరం. అలాగే బట్టీలు…. వాటికి విద్యుత్, డీజిల్ లేదా గ్యాస్ అవసరం.
ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల నుంచి రవాణా అవుతుంటాయి. కనుక పెట్రోల్, డీజిల్ రెట్లు పెరిగితే రవాణా ఛార్జీలు, అవి పెరిగితే ఈ ముడిసరుకుల ధరలు వరుసగా పెరుగుతూనే ఉంటాయి.
కనుక జీఎస్టీ తగ్గించడం లేదా తొలగించడం వల్లనో బ్రెడ్ లేదా మరో ఆహార పదార్ధం ధర ఎన్నటికీ తగ్గదు. ఒకవేళ తాత్కాలికంగా తగ్గినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది.
కానీ ట్రంప్ దెబ్బలతో అల్లాడుతున్న భారతీయ పరిశ్రమలకి, ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ట్రంప్ సుంకాలతో భారత్ పరిస్థితి ఏమవుతుందోనని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో ఇటువంటి చిన్న ఉపశమనం చాలా అవసరమే.
ఆనంద్ మహీంద్ర, హర్ష్ గోయెంకా వంటి పారిశ్రామికవేత్తలు సైతం దీనిని స్వాగతించి ఈ పండుగల సీజనులో దేశ ప్రజలకు ఇది కానుకగా అభివర్ణించారు.
నిత్యావసరాల ధరలు తగ్గితే తప్పకుండా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కనుక ఆ మేరకు దేశీయ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితే ట్రంప్ సుంకాలతో నష్టపోతున్న ఆయా వర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ ఇది ట్రంప్ సమ్మెట దెబ్బలకు పూర్తి ఉపశమనం కాబోదు.
అమెరికా ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం బలమైన నిర్ణయాలు తీసుకోకుండా కాలక్షేపం చేస్తుంటే ఒక్కోరోజుకి కొన్ని లక్షల కోట్ల నష్టం నమోదు అవుతూనే ఉంటుంది. కనుక దేశీయ ఉత్పత్తులు, సేవలకు మార్కెటింగ్ ఏవిదంగా చేయాలో ఆర్ధిక, మార్కెట్, పారిశ్రామిక తదితర రంగాల నిపుణులతో చర్చిస్తే తప్పక పరిష్కారాలు లభిస్తాయి.





