జగన్మోహన్ రెడ్డి, మంత్రి పదవులు అనుభవించిన వైసీపి నేతలు ఎవరూ కూడా తమకు లభించిన ‘ఒక్క ఛాన్స్’ విలువ తెలుసుకోలేకపోయారు. అందువల్లే బంగారం లాంటి ఆ ఛాన్స్ని వృధా చేసుకున్నారు.
కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుంటే అది చూసైనా తాము ఏమి చేయలేకపోయామో? ఏవిదంగా పనిచేసి ఉండాలో తెలుసుకొని ఉండాలి. కానీ ప్రజాకూటమి ప్రభుత్వంలో తప్పులు వెతుకుతూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఉదాహరణకు పరిశ్రమల శాఖ మంత్రి పదవి వెలగబెట్టిన గుడివాడ అమర్నాధ్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు తేలేకపోయారు. ఉన్నవి మూతపడుతుంటే, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే ఆపలేకపోయారు.
ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను విమర్శించడమే తప్ప మంత్రిగా తన కనీస బాధ్యత నిర్వర్తించలేకపోయారు. తన మంత్రిత్వ శాఖ, ఆ పదవి ఎంత కీలకమైనదో గ్రహించలేక చివరికి ‘కోడి-గుడ్డు మంత్రి’గా మిగిలిపోయారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే భారత్ పెట్రోలియం కంపెనీ (బీపీసీఎల్) ప్రతినిధులతో సమావేశమయ్యి రూ.60-70,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో బీపీసీఎల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తుంటే, దానిపై కూడా గుడివాడ అమర్నాధ్ విమర్శలు చేయడం విస్మయం కలిగిస్తుంది.
“ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు బీపీసీఎల్ ప్రతినిధులు వస్తే మేము ఆ పరిశ్రమ ఏర్పాటుకి రాష్ట్రంలో తగిన ప్రదేశాలను చూపాము. ఈవిషయం అధికారులకు కూడా తెలుసు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో అంతా ఖరారు అయితే తప్ప వాటి గురించి ప్రకటన చేయవద్దని జగన్ ఆదేశించడం వలననే మేము బీపీసీఎల్ గురించి చెప్పుకోలేదు.
బీపీసీఎల్ ప్రతినిధులు సముద్రతీరం ఉన్న ప్రాంతాలలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాలలో తిరుగుతున్నారు. ఆ ప్రయత్నంలోనే వారు మన ఏపీకి కూడా వచ్చారు తప్ప చంద్రబాబుని చూసి కాదు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వారు ఏపీకి వచ్చారన్నట్లు టిడిపి నేతలు, వారి అనుకూల మీడియా డబ్బా కొట్టుకొంటున్నాయి,” అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
జగన్ ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేసి సంక్షేమ పధకాల గురించి డప్పు కొట్టుకునేది. కానీ 5 ఏళ్ళలో విశాఖ సదస్సులో తప్ప మరెన్నడూ పరిశ్రమలు, పెట్టుబడుల గురించి మాట్లాడకపోవడం గమనిస్తే ఈవిషయంలో వారు వైఫల్యం చెందారని స్పష్టం అవుతుంది.
కనుక తమ చాతకానితనానికి గుడివాడ అమర్నాథ్ సిగ్గుపడకపోగా పెట్టుబడులు రప్పించేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను ఎద్దేవా చేస్తుండటం ఇంకా సిగ్గుచేటు.




