గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా రెండు రోజుల క్రితం మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చేతులు జోడించి మేయర్ కావటి మనోహర్ నాయుడుని, అధికారులను తన నియోజకవర్గంలో పనులు పూర్తిచేయించమని వేడుకొన్న సంగతి తెలిసిందే.
అధికార పార్టీ ఎమ్మెల్యేనైన తాను చెప్పినా పనులు చేయకపోతే రేపు ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు ఎలా అడగగలను? వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవాలని మీరు కోరుకొంటున్నారా?”అంటూ ముస్తాఫా నిప్పులు చెరిగారు.
తన నియోజకవర్గంలో మాత్రమే పనులు చేయకుండా, చేస్తున్న పనుల గురించి తనకు తెలియజేయకుండా మేయర్ మనోహర్ నాయుడే ఈ ‘డర్టీ గేమ్’ ఆడుతున్నారని ముస్తఫా అనుమానిస్తున్నారు. ఈ విషయం వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి చెవిలో పడటంతో ఆయన వెంటనే రంగంలో దిగి ముస్తఫాను చల్లబరిచారు.
ముస్తఫాను, మేయర్ మనోహర్ నాయుడు ఇద్దరినీ వెంటపెట్టుకొని ఆయన నిన్న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పర్యటించి ఎక్కడెక్కడ ఏ పనులు జరుగుతున్నాయో పరిశీలించారు. తర్వాత ముగ్గురూ కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇకపై ముస్తఫా సూచించిన అన్ని పనులను వేగంగా పూర్తి చేయాలని, ఆయన నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని చేయాలనుకొన్నా లేదా చేస్తున్నా ముందుగా ముస్తాఫాకు తప్పనిసరిగా తెలియజేయాలని అయోద్య రామిరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇద్దరి మద్య రాజీ కుదిర్చిన తర్వాత ముగ్గురూ మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు తనకు వ్యతిరేకంగా మేయర్ మనోహర్ నాయుడు కుట్రలు పన్నుతున్నారన్నట్లు మాట్లాడినా ఎమ్మెల్యే ముస్తఫా “మా మద్య ఎటువంటి విభేధాలు లేవు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి సూచించిన విదంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాము,” అని చెప్పారు.
మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, “ఎమ్మెల్యే ముస్తఫా బీఆర్ స్టేడియం అభివృద్ధి పనులు, నందివెలుగు రోడ్డులో రైల్వే వంతెన పనులు, పీకలవాగు అభివృద్ధి పనుల గురించి సమావేశంలో మాకు కొన్ని సూచనలు చేశారు. ఆ ప్రకారమే పనులు పూర్తి చేస్తాము,” అని అన్నారు.
అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ, పార్టీలో అందరం అభివృద్ధి గురించే ఆలోచిస్తుంటాము. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు మరింత సౌకర్యం కల్పించాలని కోరుకొంటాము. వాటిని అభిప్రాయభేదాలుగా భావించరాదు,” అని అన్నారు.
ముస్తఫా అలకపాన్పు ఎక్కి ఆ తర్వాత పార్టీ మారే ఆలోచన చేయకముందే అయోధ్య రామిరెడ్డి బుజ్జగించి చల్లబరిచారు. కనుక ప్రస్తుతానికి గుంటూరు వైసీపీలో ‘ఆల్ ఈజ్ వెల్’ అని పాడుకోవచ్చు.



