టీడీపీ అధికార ప్రతినిధిగా, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గా ఏపీ రాజకీయాలకు సుపరిచితమైన జీవీ రెడ్డి వృత్తి పరంగా న్యాయవాది అయినప్పటికీ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు, అలాగే టీడీపీ పార్టీలో తనకంటూ అభిమానాన్ని సంపాధించుకున్నారు.
అయితే ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలను బయటపెట్టిన జీవీ, అధికారుల పై చేసిన విమర్శలు, ఆపై ప్రభుత్వ పెద్దలతో వచ్చిన మందలింపులతో తన ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
దీనితో జీవీ రెడ్డి మీద తెగ ప్రేమాభిమానులు చూపిన వైసీపీ, జీవీ రెడ్డి ని అడ్డుపెట్టుకుని బాబు మీద, టీడీపీ పార్టీ మీద విమర్శలకు దిగింది. దీనితో జీవీ రెడ్డి టీడీపీ ని వదిలి వైసీపీ చెంతకు చేరబోతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి.
కానీ నేడు జీవీ రెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ తో అటు వైసీపీ కి ఇటు టీడీపీ కి ఇద్దరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. నిన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తూ, బాబు నాయకత్వం మీద తనకు ఎప్పటికి గౌరవం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు.
కేవలం 33 వేల కోట్ల రెవెన్యూ లోటుతో 3.2 లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించడం పై జీవీ ప్రభుత్వం మీద ప్రసంశలు కురిపించారు. అతి తక్కువ కాలంలోనే తనకు టీడీపీ పార్టీలో దక్కిన గౌరవం పట్ల కూడా ఎప్పటికి బాబుకి రుణపడి ఉంటానని, 2029 లో కూడా ఏపీకి మా సారే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆకాంక్షించారు.
టీడీపీ పార్టీ సభ్యత్వానికి, కూటమి ప్రభుత్వ పదవికి రాజీనామా చేసిన తరువాత జీవీ రెడ్డి ఖాతా నుంచి వచ్చిన తొలి ట్వీట్ కావడంతో అటు టీడీపీ శ్రేణులు, ఇటు వైసీపీ నేతలు అందరు ఆ పోస్ట్ మీద ఆసక్తి కనపరిచారు. అయితే వైసీపీ నేతలు ఉహించినట్టుగా, ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసినట్టుగా జీవీ రెడ్డి ఎక్కడ బాబు మీద వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.
అలాగే కూటమి ప్రభుత్వం మీద కూడా ఎటువంటి విమర్శలు చెయ్యలేదు. అలాగే బాబు పట్ల తనకున్న విధేయతను, టీడీపీ పార్టీ పట్ల తనకున్న అనుబంధాన్ని ఈ ట్వీట్ తో మరోమారు జీవీ స్పష్టం చేసినట్లయింది. దీంతో వైసీపీ ఆశల మీద జీవీ పసుపు నీళ్లు కొట్టినట్టయింది.




