ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులన్నట్లు తెలుగు సినీ పరిశ్రమకు ఆ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శత్రువుగా మారడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
మూడు పెళ్ళిళ్ళు అంటూ జగన్, అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని వంటివారు ఎంతగానో అవహేళన చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ అన్నిటినీ చాలా సహనంగా భరించారు. సమయం వచ్చినప్పుడు బదులు తీర్చుకున్నారు. కానీ నేటికీ సినీ పరిశ్రమలో ఉన్న పవన్ కళ్యాణ్ దానిపై ఇంత ఆగ్రహం చూపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈరోజు ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో సమావేశమైనప్పుడు, ఇకపై సినిమా టికెట్స్ పెంపు విషయంలో నిర్మాతల వ్యక్తిగత అభ్యర్ధనలని అంగీకరించవద్దని, ఇక నుంచి ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చే అర్జీలను సినిమాటోగ్రఫీ శాఖ ద్వారానే పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
అలాగే థియేటర్లలో, ముఖ్యంగా మల్టీ ప్లెక్స్లో మంచినీళ్ళు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, స్నాక్స్ వగైరాలపై దృష్టి సారించి నియంత్రించాలని సూచించారు. జూన్ 12న విడుదల కాబోతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయంలో కూడా ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమలో వారు చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగా ఉంటున్నారని, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తనని, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే కోపంతో సినీ పరిశ్రమతో ఈవిదంగానే వ్యవహరించారు. కానీ సినీ పరిశ్రమతో బలమైన అనుబందం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈవిదంగా కటినంగా వ్యవహరిస్తుండటానికి చాలా బలమైన కారణమే ఉంది.
జనసేనకి మంచి పట్టున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు విచారణలో తేలింది. థియేటర్స్ బంద్ చేయాలనుకున్న ‘ఆ నలుగురు’ నిర్మాతలలో నేను లేనని అల్లు అరవింద్ చెప్పుకోవడం గమనిస్తే, అల్లు అర్జున్-నంద్యాల పర్యటన-వైసీపీకి మద్దతు, తదనంతర పరిణామాల ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది.
కనుక ఆ కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాని దెబ్బ తీసేందుకు అల్లు అరవింద్ లేదా వైసీపీతో కనెక్ట్ అయున్న అసమదీయులే ఈ కుట్ర పన్నారా?అనే అనుమానాలు కలుగుతున్నాయి. బహుశః అందువల్లే పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్లు భావించవచ్చు.




