రాష్ట్రంలో జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ బలపడితే తాము నష్టపోతామని వైసీపీ నేతలు ఆందోళన చెందుతూ ఆయన పెళ్ళిళ్ళ గురించి పదేపదే మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని, తద్వారా సమాజంలో ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయాణిస్తుండటం అందరూ చూస్తునే ఉన్నారు.
అదేవిదంగా గత ఎన్నికలలో వైసీపీ దాని వెనుకున్న ఐప్యాక్ బృందం కలిసి టిడిపి యువనేత నారా లోకేష్ని టార్గెట్ చేసుకొని ఆయన ఎందుకు పనికిరాడంటూ ఎంతగా దుష్ప్రచారం చేసిందో అందరికీ తెలుసు. బహుశః అప్పటికే నారా లోకేష్ సమర్ధత, నాయకత్వ లక్షణాలను వైసీపీ గుర్తించి ఉండవచ్చు.
కనుక నారా లోకేష్ రాజకీయంగా ఎదిగితే వైసీపీకి, ముఖ్యంగా ‘వైసీపీ ముఖచిత్రం’గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి పోటీగా తయారవుతారని భయపడి ఉండవచ్చు. బహుశః అందుకే నారా లోకేష్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు అంతగా ప్రయత్నించి ఉండవచ్చు. అప్పుడు వాటి దుష్ప్రచారానికి నారా లోకేష్ బలైపోయిన మాట వాస్తవం.
అయితే వైసీపీ నేతల ఆ ఈసడింపులు, అవహేళనలతోనే తాను మరింత రాటుతేలానని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో స్వయంగా చెప్పారు. నారా లోకేష్ ఇంతవరకు తన గురించి ఎవరికీ తెలియని ఓ కొత్త విషయాన్ని బుదవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు బైక్ మెకానిక్కులతో భేటీ అయినప్పుడు చెప్పారు.
తాను పదో తరగతి చదువుతున్నప్పుడు తన స్నేహితుడైన ఓ బైక్ మెకానిక్తో కలిసి బైక్ ఇంజనుపెట్టి చిన్న కారును తయారు చేసిన్నట్లు చెప్పారు. ఇప్పటికీ దానిని తాను భద్రంగా దాచుకొన్నానని చెప్పారు.
నారా లోకేష్ని ఎద్దేవా చేసేందుకు కాసుకు కూర్చోనే వైసీపీ సోషల్ మీడియా బృందం, ఈవిషయం వినగానే మళ్ళీ దుష్ప్రచారం మొదలుపెట్టేసింది. అయితే నారా లోకేష్ కారు తయారుచేయడం నిజమా కాదా?అని తెలుసుకొనేందుకు ఓ మీడియా ప్రతినిధి నారా లోకేష్ ఇంటికి వెళ్ళగా ఆయన కుటుంబ సభ్యులు పెరట్లో ఉన్న ఆ కారును చూపించారు.
రెండు సీట్లతో స్పోర్ట్స్ వెహికిల్లా ఉందది. దాని డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పక్కనే ఉన్న ఓ లేటెస్ట్ మోడల్ పెద్దకారు సుమారు ఆరడుగులు ఎత్తు ఉంటే లోకేష్ తయారు చేసిన కారు కేవలం మూడడుగులే ఉండటం విశేషం. కారు బోనెట్ చక్కటి వంపుతో అందంగా డిజైన్ చేశారు. వెనుక వైపు కూడా అదేవిదంగా తయారుచేసి దానిలో మరింత లోతుగా వంపును ఏర్పటు చేయడంతో కారుకు గ్రేస్-ఫుల్ లుక్ వచ్చింది. కారు స్టీరింగ్, గేర్ సిస్టమ్, పెయింటింగ్ ప్రతీదీ చాలా చక్కగా ఆకట్టుకొనేలా ఉంది.
నారా లోకేష్ 15 ఏళ్ళ వయసులోనే ఓ కారును తయారుచేయడం గొప్ప విషయమే కదా?అయితే ఏనాడూ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గానీ ఈవిషయం ఎవరికీ చెప్పుకోలేదు. నిన్న బైక్ మెకానిక్కులతో మాట్లాడుతున్నప్పుడు యాదృచ్ఛికంగా ఈ విషయం చెప్పారు అంతే.
యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మరింత పదునుతేలారు. ప్రజాసమస్యల గురించి ఆయన ధైర్యంగా జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు, మంత్రుల, ఎమ్మెల్యేల అవినీతిని బయటపెడుతూ ఎండగడుతున్న తీరు, అదే సమయంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. నారా లోకేష్ ఓ యుద్ధవిమానంలా వైసీపీ కంచుకోటలను కూల్చివేస్తూ దూసుకువస్తున్నారు. అంటే ఆనాడు వైసీపీ ఏది జరగకూడదని భయపడిందో సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోందన్న మాట!



