ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ పాయింట్ గా నిలిచిన విజయవాడ నగరంపై రాష్ట్ర విభజన ప్రభావం బాగా పడింది. అభివృద్ధి పరంగా హైదరాబాద్ మాదిరి సుందరవనంగా విజయవాడ నగరాన్ని తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి తగ్గట్టే విజయవాడ నుండే సిఎం పాలన సాగిస్తుండగా, తాజాగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 14 పాలనా శాఖలు తరలి రావడంతో విజయవాడ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.
మరో విధంగా చెప్పాలంటే… నగర స్థాయికి మించిన జనాభాతో విజయవాడ రోడ్లు కిటకిటలాడుతున్నాయి. అభివృద్ధి పేరుతో నగర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులు ఓ వైపున జరుగుతుంటే… మరో వైపున పెరిగిన జనాభాతో నగరం అంతటా ట్రాఫిక్ రద్దీ ఎక్కువపోయింది. తాజాగా మరమ్మత్తుల నిమిత్తం ప్రకాశం బ్యారేజ్ పైకి ఎలాంటి వాహనాలను గానీ, కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా నియమ నిబంధనలు పెట్టడం… దీనికి తోడు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు కావడం… వంటి పరిమాణాలతో విజయవాడ నగర పరిసరాలు విలవిలలాడుతున్నాయి.
మరోవైపు ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోని ఆయా శాఖల ప్రధాన కార్యాలయాలు (హెచ్ఓడీలు) మాత్రం సోమవారం నాడు జనాలు లేక బోసిపోయాయి. అమరావతిలో కార్యాలయాల ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఉండాల్సిన ఉద్యోగులు కూడా అమరావతికి తరలివెళ్ళడంతో, హైదరాబాద్ లోని కార్యాలయాలన్నీ ఉద్యోగులు లేక వెలవెలబోయాయి. ఆయా కార్యాలయాల్లోని ఏపీ విభాగాలకు తాళాలు దర్శనమివ్వగా, పార్కింగ్ ప్లేస్ లు కూడా వాహనాలు లేక ఊసురుమన్నాయి.



