కళాకారుల జాబితాతో పార్లమెంటులోకి ఎంట్రీ ఇచ్చే సినీ నటులు ఆ తరువాత పెద్దల సభవైపు పెద్దగా చూడరన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇలాంటి వాదన తప్పని కొంత మంది నిరూపించగా, మరికొందరు ఈ ఎంపీ హోదా అలంకారానికే తప్ప దీనితో తమకు ఎలాంటి ఉపయోగం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో సినీ నటి రేఖ అగ్రస్థానంలో నిలిచారు. కేవలం 5 శాతం మాత్రమే ఆమె హాజరుయ్యిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వెల్లడించింది.
2012, ఏప్రిల్ లో రాజ్యసభకు నామినేటైన రేఖ పెద్దల సభలో ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అలాగే పార్లమెంటులో జరిగే ఒక్క చర్చలోనూ పాలుపంచుకోలేదు. ఆమె తరువాతి స్థానంలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి నిలిచారు. ఈయన గారి హాజరు కేవలం పది శాతమే. పెద్దల సభలో 68 శాతం హాజరు నమోదు చేసుకున్న షాట్ గన్ శత్రుఘ్నసిన్హా ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు, అలాగే ఇంతవరకు జరిగిన ఏ చర్చలోనూ పాలుపంచుకోలేదు.
ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ భార్య ఛండీగఢ్ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిరణ్ ఖేర్ సినీ నటులందర్లోకి ఎక్కువ సార్లు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. 85 శాతంతో ఆమె అగ్రస్థానంలో నిలవగా, తరువాతి స్థానంలో పరేష్ రావల్ ఉన్నారు. 76 శాతం హాజరుతో ఆకట్టుకాగా, లోక్ సభలో 82 శాతం అటెండెన్స్ తో టీఎంసీ ఎంపీ శతాబ్దిరాయ్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారి సభను ఆకట్టుకున్నారు. హేమ మాలిని హాజరు కేవలం 37 శాతంగా కాగా, 10 చర్చల్లో పాల్గొన్న ఆమె మొత్తం 113 ప్రశ్నలు అడిగి శభాష్ అనిపించుకున్నారు.



