ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ రావాలంటే… ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తే, నిముషాలలో ‘స్పెషల్ స్టేటస్’ వస్తుందని ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు శివాజీ మొన్నటివరకు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ‘స్పెషల్ స్టేటస్’ విషయంలో తానేమీ చేయగలిగింది లేదు, ఢిల్లీ వెళ్లి పోరాడినా ఫలితం ఉండబోదు అంటూ పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పడంతో… ఇక పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరన్న విషయం శివాజీకి పూర్తిగా అవగతం అయ్యిందా?
ఏమో… తాజా వ్యాఖ్యలు పరిశీలిస్తే… ‘జనసేన’ అధినేతపై పూర్తిగా నమ్మకాలు వదులుకున్నట్లుగా కనపడుతోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తే తప్ప స్పెషల్ స్టేటస్ రాదని చెప్పిన శివాజీ, ప్రస్తుతం ఆ అవకాశం ఒక్క వెంకయ్య నాయుడు గారికే ఉందని అంటున్నారు. ‘ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు రాజీనామా లేఖ పంపిస్తే, ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, అప్పుడు ఆయన కూడా ప్రజలలో హీరో అవుతారని అభివర్ణించారు శివాజీ.
నిజానికి ఏపీకి జరుగుతున్న అన్యాయంలో కీలక పాత్రలు పోషించేది వెంకయ్య నాయుడు మరియు అరుణ్ జైట్లీలేనని తీవ్ర ఆరోపణలు చేసారు. వెంకయ్య గారు గనుక రాజీనామా చేస్తే అది దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీస్తుందని, తద్వారా ఖచ్చితంగా ఏపీకి ప్రయోజనకారి అయిన నిర్ణయాన్ని ఆశించవచ్చనేది శివాజీ లాజిక్. కేంద్రమంత్రి వర్గం నుండి టిడిపి మంత్రులు బయటకు రావడాన్ని మంచి పరిణామంగా ఆహ్వానించిన శివాజీ, ప్రజలకు దోహదపడేలా వెంకయ్య నాయుడు తుది ఆలోచనలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.



