‘హైటెక్’ సీఎం కి ‘ఐప్యాక్’ ప్రతిపక్షం…!

Hitech CM Chandrababu Naidu IPAC Opposition Jagan Reddy

నాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసి హైటెక్ సిటీ నిర్మాణంతో, 2020 విజన్ తో, ప్రజలకు టెక్నాలిజీ ని చేరువ చేసి హైటెక్ ముఖ్యమంత్రిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించారు నారా చంద్రబాబు నాయుడు. ఇక ఆ మార్క్ పాలనతోనే మరో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు.

అయితే ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకొచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడానికే సమయాన్ని వెచ్చిస్తూ, టెక్నాలజీలో కొత్తదనాలను వెతుకుతూ, ఇప్పుడు విజన్ 2040 తో ఏపీ పునర్నిర్మాణం, అమరావతి కలల సౌధంతో ఆ హైటెక్ సీఎం అనే గుర్తింపుని రెట్టింపు చేసుకోవాలని ఏడు పదుల వయస్సులోనూ తాపత్రయ పడుతున్నారు బాబు.

ADVERTISEMENT

అయితే ఇదంతా రాష్ట్రానికి ఒక వైపు ఉన్న నాయకత్వం తాలూకా ఆలోచనలు. నాణానికి మరో వైపు ఉన్నట్టే ఏపీ రాష్ట్రానికి కూడా జగన్ అనే మరో నాయకత్వం ఉంది. ఈ నాయకత్వం తాలూకా ఆలోచనలన్నీ కూడా ‘గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్’ తరహాలో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించే ఒక కనికట్టు మాయాజాలం. ఈ గారడితో ప్రజలను భ్రమ పెట్టె రాజకీయం చేయడంలో జగన్ సిద్దహస్తుడనే చెప్పాలి.

అయితే తన ఐదేళ్ల అధికారంలో జగన్ చేసిన కనికట్టు అంతాఇంతాకాదు. తన పార్టీకి సంబంధించిన వ్యక్తులనే సాఫ్ట్ ఇంజనీర్లుగా, ఐటీ పారిశ్రామిక వేత్తలుగా, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఇలా ఉన్న ఆ కొంతమందికే అన్ని వేషాలు వేయించి జగన్ పాలనలో, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడుతూ ఉంది, అభివృద్ధిలో అగ్రస్థానంలో దూసుకెళ్లిపోతుంది అంటూ ఇంద్రజాల ప్రదర్శన చేసారు.

చివరికి ఎన్నికల ప్రచారంలో కూడా సిద్ధమా అంటూ పెట్టిన సభలకు కూడా జగన్ ఇదేతరహా రాజకీయాన్ని ఎంచుకుని తన ఐ ప్యాక్ టీమ్ తో సోషల్ మీడియాలో ఐప్యాక్ ప్రచారాలు చేసి అడ్డంగా దొరికారు. దీనితో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో పరదాల చాటున, టెక్నాలిజీ మాటున జగన్ నడిపిన రాజకీయానికి కూడా ఒక గుర్తింపు దక్కింది.

వైసీపీ చేసిన రాజకీయం, జగన్ పాలన విధానాలతో ‘పరదాల ముఖ్యమంత్రి’గా, ‘ఐ ప్యాక్ ఇంద్రజాలకుడి’గా ఏపీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు జగన్. అయిన కూడా జగన్ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న వంశీ అరెస్టు సందర్భంగా జగన్ చేసిన పరామర్శ యాత్రలో వైసీపీ చేసిన ‘చిన్న పిల్లల చేష్టలు’ జగన్ కు ఉన్న ఐ ప్యాక్ నేత ట్యాగ్ ను మరోమారు తెర మీదకు తెచ్చింది.

అయితే ఈనాటి సోషల్ మీడియా యుగంలో మ్యాజిక్ వెనుక ఉండే ఆ మర్మమేమిటో సాధారణ ప్రజలు కూడా యిట్టె తెలుసుకోగలుగుతున్నారు. అలాంటిది వైసీపీ చేసే ఈ ఐ ప్యాక్ రాజకీయాలు ప్రజలు గమనించలేరా.? ఇటువంటి రాజకీయాలకు నేడు కాలం చెల్లింది. వీటి వల్ల వైసీపీ విధానాలు, జగన్ రాజకీయాలు చిన్న బుచ్చుకుంటాయే తప్ప పెద్దరికం సాధించలేవు.

ఏపీ ప్రజల అదృష్టమో, దురదృష్టమో కానీ రాష్ట్రంలోని విపక్షం, అధికార పక్షం రెండు కూడా టెక్నాలజీతో రాజకీయం చేస్తున్నాయి. దీనితో ‘హైటెక్ సీఎం’ కి ‘ఐప్యాక్ ప్రతిపక్షం’ అన్నట్టుగా మారిపోయింది ఏపీ రాజకీయం. అయితే ఇందులో ఒకరిది కనికట్టు మాయాజాలం అయితే మరొకరిది కంటికి కనిపించే అభివృద్ధి మంత్రం.

ADVERTISEMENT
Latest Stories