శాసనసభ ఎన్నికలలో 175 కి 175 సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో జగన్కు చాలా నామోషీగా ఉండటం సహజమే. ఆ కారణంగానే ప్రజలకు మొహం చూపించలేక ఇంతకాలం తాడేపల్లి, పులివెందుల, బెంగళూరు ప్యాలస్ల మద్య తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు.. అని ప్రజలు అపోహ పడుతున్నారు. కానీ ప్రాణ భయంతోనే బయటకు రావడం లేదని గుంటూరు, విజయవాడ ట్రయల్ రన్లో జగన్ హింట్ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాణభయంతో ప్యాలస్లో నుంచి బయటకు వచ్చేవారు కారు. వస్తే దారి పొడవునా పరదాలు కట్టించుకునేవారు. పచ్చటి చెట్లు నరికించేసేవారు.
కూటమి ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదని జగన్ ఓ లైన్ ఇచ్చేశారు కనుక వైసీపీ నేతలు దానిని పట్టుకొని అల్లుకుపోతున్నారు.
అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “జగన్ ప్రజల మద్యకు రాకుండా అడ్డుకునేందుకే కూటమి ప్రభుత్వం ఆయనకు భద్రత కుదించింది,” అంటూ విమర్శలు గుప్పించారు. అంటే జగన్ ప్రాణ భయంతో బయటకు రావడానికి జంకుతున్నారని చెప్పేశారన్న మాట!
జగన్ 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి కనుక ఆయన భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం నేటికీ వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయక తప్పడం లేదు. ఇంత భద్రత కల్పిస్తున్నా ఇంకా ప్రాణ భయమేనా?ఇంత ప్రాణభయం ఉంటే ఇంక పార్టీని ఎలా నడిపిస్తారు? రాజకీయాలలో ఎలా కొనసాగగలరు?
ప్రజల మద్యకు రావడానికి భద్రత సరిపోదు. కోర్టు విచారణకు హాజరవ్వాలంటే నామోషీ. శాసనసభకు హాజరయ్యేందుకు ప్రదానప్రతిపక్ష హోదా లేదు.
ఇలా తన ప్రాణభయాన్ని, ఆహాన్ని, తప్పులని కప్పి పుచ్చుకునేందుకు కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వాన్ని నిందించడం దేనికి?
జగన్కి ఇంత ప్రాణభయం ఉంది కనుకనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెల్లెమ్మ చెపుతోంది. పార్టీ పగ్గాలను వేరేవరికైనా అప్పగించేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు… కదా?




