వైసీపి ఎంపీలలో మళ్ళీ అవకాశం ఎంతమందికి?

YCP Social Media

వైసీపి ఎంపీలలో ఈసారి కొంతమందిని శాసనసభ ఎన్నికల బరిలో దిగబోతుంటే, కొంతమందిని పక్కన పెట్టి వారి స్థానంలో కొత్తవారిని బరిలో దింపబోతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో ఆయన స్థానంలో నెల్లూరి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శాసనసభ అభ్యర్ధిగా జగన్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఖాళీ అవుతున్న ఆ ఎంపీ సీటుకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భర్తీ చేయబోతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకొన్న ఒంగోలు వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, అలాగే అశ్లీల వీడియో వ్యవహారంలో పార్టీ పరువు మంటగలిపినందుకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌లకు ఈసారి అవకాశం లభించకపోవచ్చునని సమాచారం.

ADVERTISEMENT

మాగుంట కుమారుడు రాఘవ్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్‌లో జైలుకి వెళ్ళివచ్చారు. కానీ తన కుమారుడే ఈసారి లోక్‌సభకు పోటీ చేస్తారని శ్రీనివాసులు రెడ్డి చెప్పుకొంటుంటే, అక్కడ నుంచి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇన్నేళ్ళుగా ఆయనను వెనకేసుకొని వచ్చి ఇప్పుడు ఎన్నికలలో పక్కన పెడితే, నేరం చేసిన్నట్లు అంగీకరించిన్నట్లే అవుతుంది. పైగా ఆయన నోరు విప్పితే పార్టీకి కూడా చాలా ప్రమాదం. కనుక ఈసారి ఆయనను జమ్మలమడుగు నుంచి శాసనసభకు పంపించవచ్చని తెలుస్తోంది.

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్టీపై తిరుగుబాటు చేసినందున, గోకరాజు రంగరాజుతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ భావించి నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు. కానీ ఆయన పోటీకి ఆసక్తి చూపడం లేదు. కనుక అక్కడ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధి కోసం వైసీపి గాలిస్తోంది.

విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాపింగ్ జరిగినప్పుడు, జిల్లాలోని వైసీపి నేతల మద్య లుకలుకలు బయటపడ్డాయి. కనుక ఈసారి ఆయన లోక్‌సభకు పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ జగన్‌ అవకాశం ఇస్తే విశాఖలో గాజువాక నుంచి శాసనసభకు పోటీ చేయాలను కొంటున్నట్లు తెలుస్తోంది.

గుంటూరులో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్‌ను ఢీ కొనాలంటే చాలా బలమైన అభ్యర్ధి అవసరం. కనుక మాజీ క్రికెటర్ అంబటి రాయుడి పేరు పరిశీలించినా ఆయన వల్ల కాదని గ్రహించడంతో వేరే అభ్యర్ధి కోసం గాలిస్తున్నారు.

గత ఎన్నికలలో నరసాపురంలో రాయపాటి సాంబశివరావుని ఓడించిన లావు శ్రీకృష్ణ దేవరాయలను ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆయన అందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఒకవేళ ఆయన ఇందుకు అంగీకరిస్తే, గత ఎన్నికలలో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈసారి నరసాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

కనుక ఈసారి ఎంతమంది వైసీపి ఎంపీలు మళ్ళీ పోటీ చేస్తారో?వారిలో శాసనసభకు పోటీ చేసే వారెందరో?మిగిలినవారిలో జగన్‌ ఎంతమందిని పక్కన పెడతారో?తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories