తెలంగాణలో వైరస్ ఉధృతిని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే జూలై చివరి నాటికి రాష్ట్రంలో 60 వేల పాజిటివ్ కేసులు నమోదవుతాయని భావిస్తోంది. అంతకంటే ఎక్కువైనా ఆశ్చర్యపోవనవసరం లేదని అధికారులు అంటున్నారు. టెస్టుల సంఖ్య పెంచుకుంటూ పోయే కొద్దీ కేసులు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని పశ్చిమ మండలంలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2,593 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రైవేట్ ల్యాబ్లలో పరీక్షలు చేసుకున్న వారి వివరాలు తెలిస్తే ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 117 మంది కరోనాతో మృతి చెందారు.
మలక్పేట్ సర్కిల్లో 640, సంతోష్ నగర్లో 574, చాంద్రాయణగుట్టలో 370, చార్మినార్లో 463, ఫలక్నుమాలో 344, రాజేంద్రనగర్ సర్కిల్లో 202 మంది ఇప్పటి వరకు కరోనా బారినపడ్డారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలం అయ్యిందనే ఆరోపణలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.
మొదట్లో వీధిలో ఒకరికి పాజిటివ్ వస్తే ఆ వీధినంతా అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం ప్రతివీధిలో ఒక పాజిటివ్ కేసు నమోదవుతున్నా కట్టడి చేయడం లేదు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తి ఇంటిని మాత్రమే కట్టడి చేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో ఎవరి ఇంట్లో పాజిటివ్ వచ్చిన వారు ఉన్నారో తెలియడం లేదు.





