కొద్దిపాటి వాన కురిస్తేనే హైదరాబాద్ నగరం నీట మునుగుతుంటుంది. బుధవారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. కనుక హైదరాబాద్లో పరిస్థితి ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందో టీవీ న్యూస్లో అందరూ చూస్తూనే ఉన్నారు.
ఏపీలో కూడా గత రెండు రోజులుగా భారీగా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఈసారి ఈశాన్య ఋతుపవనాలు కాస్త ముందుగానే వస్తున్నందున వాటి ప్రభావంతో వర్షాలు మొదలైతే మరో 2-3 నెలలు ఏకధాటిగా పడతాయి.
సముద్రానికి, నదులకు దూరంగా ఉన్న హైదరాబాద్ నీట మునుగుతుంటే, ఓ పక్క పొంగి ప్రవహించే కృష్ణానది, కొండవీటివాగు, పాలవాగు పక్కనే నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతి పరిస్థితి ఏమిటనే సందేహం కలుగక మానదు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు అమరావతి నీట మునిగిందంటూ వైసీపీ అప్పుడే పాత ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టేసింది.
కనుక అమరావతి వాస్తవ పరిస్థితి గురించి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
అమరావతి ప్రీ-ప్లాన్డ్ సిటీగా నిర్మిస్తున్నందున, ఎంత భారీ వర్షాలు కురిసినా, ఎంత వరద పోటు అటువంటి సమస్యలు తలెత్తవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా వర్షపు నీరు, వరద నీరు అమరావతి చుట్టూ నిర్మిస్తున్న మూడు ప్రధాన జలాశయాలలోకి వెళ్ళిపోతుంది.
కృష్ణానదిలో 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, కొండవీటివాగు, పాలవాగు పొంగి ప్రవహించినా తట్టుకునే విదంగా అమరావతి చుట్టూ కొండవీటి వాగు, పాలవాగు, ఉండవల్లిలో వైకుంఠపురం వద్ద మూడు భారీ జలాశయాలు నిర్మిస్తోంది ప్రభుత్వం.
ఈ వాగులలో ప్రవహించే వరద నీటిని జలాశయాలలోకి తోడి పోసేందుకు ఉండవల్లి, వైకుంఠపురం వద్ద రెండు పంప్ హౌస్లు ఏర్పాటు చేస్తోంది. అలాగే ఈ జలాశయాల నుంచి 48.3 కిమీ పొడవునా కాలువలు నిర్మిస్తోంది.
తద్వారా రాజధాని అమరావతితో సహా చుట్టు పక్కల ప్రాంతాలలో తాగు, సాగు నీటి అవసరాలకు ఈ నీటిని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయి.
కనుక ఎంత భారీ వర్షం పడినా, వరదలు వచ్చిన అమరావతిలో హైదరాబాద్ వంటి దుస్థితి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఈ జలాశయాలు, కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తయ్యేవరకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు.




