ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో ఓట్లు వేసేందుకు హైదరాబాద్ నుంచి సెటిలర్స్ లక్షల సంఖ్యలో ఆంధ్రాకు చేరుకుంటున్నారు. వారి కోసం టిఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నాయంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
వేలాదిమంది సొంత కార్లలో ఏపీకి బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ హైవే రోడ్లో భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది. చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజాల వద్ద ఎంత త్వరగా వాహనాలను క్లియర్ చేస్తున్నా వాహనాలు పేరుకుపోతూనే ఉన్నాయి.
కేవలం సంక్రాంతి పండుగ సమయంలోనే ఇంత రద్దీ ఉండేది. కానీ తొలిసారిగా ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల సమయంలో కనిపిస్తోంది. వారాంతపు సెలవులకు సోమవారం పోలింగ్ సెలవు కూడా కలిసి రావడంతో శుక్రవారం రాత్రి నుంచే సెటిలర్స్ ఆంధ్రాకు బయలుదేరడం మొదలుపెట్టారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలను కాదని ఏపీ శాసనసభ ఎన్నికలలో ఓట్లు వేయడానికి ఎందుకు వస్తున్నారో అందరికీ తెలిసే ఉంటుంది. జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినందుకు వైసీపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్నవారు కొందరైతే, పవన్ కళ్యాణ్ అభిమానులు మరికొంత మంది.
ఈ ఎన్నికలు టిడిపి, జనసేనలకు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భవిష్యత్కు కూడా చాలా కీలకమైనందున, లక్షల సంఖ్యలో సెటిలర్స్ ఏపీకి తరలివస్తున్నారు.
వారిలో మూడు పార్టీల అభిమానులు ఉన్నారు. కనుక రెండు వంతుల మంది ఓట్లు టిడిపి, జనసేనలకు పడబోతుంటే, ఒకవంతు వైసీపికి పడే అవకాశం ఉంటుంది. ఐటి ఉద్యోగులలో వైసీపిని అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. వారందరూ చంద్రబాబు నాయుడుని, టిడిపిని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, జగన్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయడాన్ని వారిలో చాలా మంది ఖండించారు. కనుక వారు సైతం ఈసారి కూటమికే ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది.
కనుక హైదరాబాద్ నుంచి ఇన్ని లక్షల మంది ఏపీకి తరలివస్తుండటం కూడా కూటమికి కలిసి వచ్చే అంశమే అని భావించవచ్చు.




