తెలంగాణలో నిత్యం ఏదో ఓ జిల్లాలో ఏదో ఓ అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నేడు ఆ రాష్ట్ర తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నిజామాబాద్ పట్టణంలో ఐటి టవర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ప్రారంభోత్సవం చేశారు. ఒకప్పుడు ఐటి కంపెనీలన్నీ హైదరాబాద్లో మాత్రమే ఉండేవి. కానీ తెలంగాణలో ప్రతీ జిల్లా కేంద్రంలో ఓ ఐటి పార్క్ లేదా ఐటి టవర్ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఏపీలో డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి యువతీయువకులు సర్టిఫికెట్లు పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వలసలు పోతుంటే తెలంగాణలో మాత్రం యువతీయువకులకు వారి సొంత జిల్లాలలోనే ఉన్నతవిద్యలు చదువుకొనేందుకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, అక్కడే ఐటి హబ్లు కూడా ఏర్పాటు చేస్తుండటంతో వాటిలోనే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదిన్నరేళ్ళలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ నగరంలో 30కి పైగా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వగైరాలు నిర్మించింది. గత ఏడాది ప్రారంభించిన దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జి హైదరాబాద్కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిత్యం దానిపై సినిమా షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి.
తాజాగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో పూర్తిగా స్టీల్తో నిర్మించిన ఫ్లైఓవర్ ఈనెలాఖరున ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. ఇక మెట్రో రైలు మార్గాన్ని ప్రతీ రెండు మూడేళ్ళకు ఓసారి నలువైపులా పొడిగించుకొంటూనే ఉన్నారు.
ఇప్పుడు ఏపీలో ఫ్లైఓవర్లు, మెట్రో రైల్, ఐటి కంపెనీలు, పచ్చదనం విషయానికి వస్తే, వైసీపీ నేతలు చెప్పుకొంటున్న విశాఖ రాజధానిలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ నిర్మించలేదు. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి ఐటి కంపెనీలు, పరిశ్రమలు హైదరాబాద్కు తరలిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోగా కొత్తవాటికి శంకుస్థాపనలు చేస్తోంది!
ఉదాహరణకి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తుంటే, దానిని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా కడపలో కొత్తగా స్టీల్ ప్లాంట్ కడతామంటూ శంకుస్థాపన చేశారు. లులూ కంపెనీని తరిమేసి ఇనార్బిట్ మాల్కి శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో పూర్తయిన అభివృద్ధిపనులకు మంత్రులు ‘ప్రారంభోత్సవాలు’ చేస్తుంటే, ఇక్కడ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇప్పుడు తాపీగా అభివృద్ధి పనులకు ‘శంకుస్థాపనలు’ చేస్తున్నారు. విశాఖలో మెట్రో ఊసే లేదు. కేంద్రం దానిని మరిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగడం మానుకొంది.
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ళుగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఓ మహాయజ్ఞంగా నిర్వహిస్తుండటంతో ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం గుర్తించే స్థాయిలో హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పచ్చదనం పెరిగింది.
కానీ ఏపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు వస్తే ఏపుగా పెరిగిన పచ్చటి చెట్లను నరికించేయడం, ఆ తర్వాత ఆయనే మొక్కలు నాటుతుండటం పరిపాటిగా మారిపోయింది. ఋషికొండపై పచ్చటి చెట్లను నరికించేసి గుండు కొట్టించేస్తే సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో ఋషికొండపై పచ్చటి పరదాలు కప్పేసి కొండను పచ్చగా చూపిస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి సులువైన గొప్పగొప్ప ఆలోచనలు కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు రావో?
పాలకుల ఆలోచనలు, విధానాలు, నిర్ణయాలు సరైనవైతే ఏవిదంగా రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందో తెలంగాణను చూస్తే అర్దమవుతుంది. అలాలేకుంటే రాష్ట్రం ఏవిదంగా తయారవుతుందో ఏపీని చూస్తే అర్దమవుతుంది.



