రాజకీయంగా ‘జనసేన’ పార్టీకి గానీ, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు గానీ మెగా కుటుంబం అందిస్తోన్న సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. అయితే ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా ఒంటరిగా రాజకీయ ప్రస్థానం సాగిస్తోన్న పవన్ గమ్యం చివరికి ఎక్కడికి వెళుతుందో గానీ, కుటుంబ పరంగా మెగా బ్రదర్ నాగబాబు ఒక్కరే గతంలో పవన్ కు అండగా ఉన్నారు.
గత ఎన్నికలలో జనసేన తరపున ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తనకు అసలు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని, పవన్ కళ్యాణ్ తన తమ్ముడు కాబట్టి తాను ఏమీ అడగలేదని, పవనే వచ్చి మీ లాంటి వాళ్ళు ఎంపీగా అక్కడ సేవలందిస్తే బాగుంటుందని చెప్తే, పోటీ చేయాల్సి వచ్చిందని నాగబాబు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నాగబాబు వ్యాఖ్యలు వింటుంటే, నాడు ‘ప్రజారాజ్యం’ స్థాపన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి. “మీ అభిమానులంతా కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వచ్చానని” చిరంజీవి చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఎవరో చెప్తేనే, ఇంకెవరో కోరుకుంటేనో పోటీ చేస్తే వాటి అనుభవాలు ఎలా ఉంటాయో చిరు, నాగబాబుల ఉదంతాలే చెప్తున్నాయి.
ప్రజాసేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి గానీ, వాళ్ళు చెప్పారని పోటీ చేశా, అందుకే ఓటమి పాలయ్యాననే భావాన్ని ప్రదర్శించడం నాగబాబు రాజకీయ పరిణితికి అద్దం పడుతుంది. ఈ విషయంలో ఇద్దరు మెగా బ్రదర్స్ కు భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉన్నాయి. తాను గెలిచినా, ఓడినా మొత్తం భారమంతా తన పైనే వేసుకుని ప్రజాసేవ చేయాలనే చిత్తశుద్ధిని చాటుతున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ లో ఈ నిజాయితీ చూసే చాలామంది అభిమానిస్తుంటారు. సినిమాలలో నటించడం ద్వారా దక్కిన పాపులారిటీ కంటే, ఇలా పవన్ వ్యక్తిత్వం గమనించి ఆదరించే వారే ఎక్కువ. అయితే వీరందరిని తన ఓట్ బ్యాంకుగా మలుచుకోవడంలో మాత్రం ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ విఫలమవుతున్నారు. ఇదే రాజకీయంగా ‘జనసేన’ ఆశించిన స్థాయిలో ఎదగనివ్వకుండా చేస్తోంది.
ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉండగా, క్షేత్రస్థాయిలో బలపడే విధంగా ఎలాంటి కార్యాచరణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవలంభించడం లేదు. పొత్తుల గురించి కాదు, ముందు క్షేత్రస్థాయిలో బలపడే విధంగా ముందుకు వెళదామని అభిమానులకు పిలుపునిచ్చిన పవన్, ఆ దిశగా ఎలాంటి ప్రణాళిక రచించకపోవడం విస్తుపోయే అంశం.



