పూణే టెస్టులో జరిగిన భారీ ఓటమికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అనూహ్యంగా పుంజుకుని భారత జట్టు విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత జట్టు సిరీస్ లో ఆస్ట్రేలియాతో పాటు 1-1గా సమఉజ్జీగా నిలవడంతో పాటు… ఐసీసీ వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్ లో తన నెంబర్ వన్ ర్యాంకును పదిలం చేసుకుంది.
సిరీస్ ప్రారంభం నాటికి భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ 109 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే తొలి టెస్ట్ లో ఓటమి పాలు కావడం, రెండవ టెస్ట్ రెండు రోజుల వరకు పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో, నెంబర్ 1 స్పాట్ మారిపోతుందని అంతా భావించారు. కానీ తాజా విజయంతో దాదాపుగా స్పష్టత వచ్చేసినట్లే. ఏప్రిల్ 1 నాటికి టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టును వరల్డ్ నెంబర్ వన్ టెస్టు జట్టుగా ఐసీసీ ప్రకటిస్తుంది.
నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నందుకు గాను ఐసీసీ సదరు జట్టుకు 6 కోట్ల 70 లక్షల రూపాయల నజరానా అందజేస్తుంది. ఇప్పుడు ఈ భారీ నజరానా భారత జట్టుకు అందనుంది. ఇప్పటికే ఒక టెస్టులో నెగ్గి, ఒక టెస్టులో ఓడడం ద్వారా ఈ రెండు జట్ల పాయింట్ల మధ్య తేడాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ నెలాఖరుకి ఈ పాయింట్లలో పెద్ద తేడా వచ్చే అవకాశం లేదు. దీంతో ఐసీసీ వరల్డ్ నెంబర్ వన్ హోదాతో పాటు భారీ నజరానా భారత జట్టు సొంతం కానుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



