ఒక చిన్న ఇల్లు నిర్మాణం ఏ కారణం చేతనైనా మద్యలో ఆగిపోతే దానికి అనుకున్న బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది. అటువంటిది లక్షల కోట్లతో నిర్మిస్తున్న ఓ రాష్ట్ర రాజధాని నిలిపివేస్తే ఎంత నష్టమో, 5 ఏళ్ళ తర్వాత దాని అంచనా వ్యయం ఎంతగా పెరిగిపోతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు అమరావతి విషయంలో అదే జరుగుతోంది.
సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనులని పునః ప్రారంభించనున్నారు. ఆనాడు రూ.160 కోట్లు వ్యయంతో ఏడు అంతస్తులు నిర్మించాలనుకున్నారు. కానీ ఈ 5 ఏళ్ళలో నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో అదే భవన నిర్మాణానికి అదనంగా మరో రూ.30-40 కోట్లు ఖర్చు చేయక తప్పదు.
ఒక్క సీఆర్డీఏ కార్యాలయానికే ఇంత అదనపు ఖర్చవుతుంటే అమరావతిలో అనేక ఇతర భవనాలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ లైన్లు వగైరా పనులకు ఇంకెంత అదనపు భారం పడుతుందో ఊహించలేము. కానీ రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అవమానకర పరిస్థితులు ఎదుర్కుంటోంది. కనుక ఎంత అదనపు భారం అయినా భరించక తప్పదు.
అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంక్ స్వల్పవడ్డీతో రూ.15,000 కోట్లు దీర్గకాలిక రుణం మంజూరు చేసింది. కానీ ఇది ఏ మూలకి సరిపోదు. కనుక అమరావతి నిర్మాణానికి సిఎం చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆన్వేషిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి అమరావతికి భారీగా నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు రూపంలో కాకుండా అమరావతిని రాష్ట్రంలో ఇతర జిల్లాలు, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కలుపుతూ రోడ్లు, రైల్వే మార్గాలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. కానీ అమరావతిలో భవనాల నిర్మాణం కోసం భారీగా నిధులు అవసరం ఉంది. వాటిని సిఎం చంద్రబాబు నాయుడు ఏవిదంగా సమకూర్చుకుంటారో మున్ముందు తెలుస్తుంది.
అమరావతే రాజధానిగా ఉంటుందనే జగన్ మాయ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మి అధికారం అప్పగించడం పేనుకి పెత్తనం అప్పగించిన్నట్లే అయ్యింది.
జగన్ అమరావతిని నిర్మించకపోగా దానిని 5 ఏళ్ళు పాడు బెట్టేసి రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. జగన్ చేసిన తప్పులు, నష్టాలను చక్కబెట్టుకొని ముందుకు సాగడమే ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుకి పెద్ద పనిగా మారింది.
కానీ తాను జగన్లాగ సంకుచితంగా వ్యవహరించలేనని ఎంత కష్టమైనా అమరావతి నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పారు.
అమరావతి పట్ల జగన్ వైఖరి ఏమిటో స్పష్టమైంది. కనుక ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్న అమరావతి నిర్మాణ పనులు ఆగిపోకుండా ముందుకు సాగాలంటే, వచ్చే ఎన్నికలలో కూడా జగన్కి ప్రజలు అవకాశం ఇవ్వకూడదు. అప్పుడే అమరావతి పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడుతుంది.




