మీ ఇంట్లో జరిగే పెళ్లికి పిలవకపోయినా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు విచ్చేస్తారు. తాజాగా వెలువడుతోన్న నిబంధనల ప్రకారం పెళ్లి ఖర్చులకు కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. పెళ్లి ఖర్చులకు, మీ బ్యాంకు బ్యాలెన్స్ కు మధ్య వ్యత్యాసముంటే ఐటీ శాఖకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు సంతృప్తి చెందేలా వివరణ ఇవ్వకుంటే… ఎవరైనా సరే చిక్కుల్లో పడక తప్పదు.
గతేడాది నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసి షాక్ ఇచ్చిన కేంద్రం, తాజాగా ఆదాయ పన్ను సవరణతో మరో షాక్ ఇచ్చింది. తాజా చట్ట సవరణతో వ్యక్తులు తమ ఆదాయానికి, వ్యవయానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఐటీ చట్టం ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం వరకు పన్ను కట్టాల్సి ఉంటుంది. తాజా చట్ట సరవణ ప్రకారం… అప్పు తెచ్చుకున్నా… అది అప్పుగా నిరూపించలేకపోతే ఆ సొమ్ముపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్కసారిగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయినా వివరణ ఇవ్వాల్సిందే. లేకుంటే పన్ను కట్టక తప్పదు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారం, నగలు, వ్యవసాయ ఆదాయం ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోళ్లు జరిపితే మాత్రం ఆదాయపన్ను చట్టం వర్తించదు. కాకపోతే ఆ ఆదాయాన్ని నిరూపించలేకపోతే మాత్రం తిప్పలు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీ ప్రారంభించే సమయంలో పెట్టే సీడ్ మనీకి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి.
ఆదాయపు పన్ను అధికారులకు రికార్డులు సమర్పించడంలో విఫలమైతే పన్ను షరామామూలే. ఇక నెల వారీ ఖర్చులు పెరిగినా ఇబ్బందులు తప్పవు. పెరిగిన ఖర్చును ఎలా భరించారో, అకస్మాత్తుగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఐటీ అధికారులు వివరణ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారు సంతృప్తి చెందేలా వివరణ ఇచ్చారా? సరే… లేకుంటే పన్ను బాదుడు మామూలే! లేకుంటే తదుపరి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పెళ్లి వంటి శుభకార్యాలకు కూడా పన్నుల చట్టం అమలు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



