ఇంగ్లాండ్ కు చుక్కలు చూపిస్తున్న విరాట్ కోహ్లి!

ind-vs-eng-1st-test-3rd-day-kohli-dominatesమూడవ రోజు ఆట ముగిసే సమయానికి రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 107/5తో ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టును స్టోక్స్, బైర్ స్టో ఆదుకున్నారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించి, జట్టును గాడిలో పెడుతున్న తరుణంలో బైర్ స్టో 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ కావడంతో భారత బౌలర్లకు ఉపశమనం లభించినట్లయ్యింది.

ఆ తర్వాత స్టోక్స్ కూడా 70 పరుగుల వద్ద పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ కు ఫాలో ఆన్ తప్పదని భావించారు. అయితే స్పిన్నర్ రషీద్ 32 పరుగులతో ఎదురీదడంతో సరిగ్గా 255 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యి, 200 పరుగుల లీడ్ ను భారత్ కు అందించింది. స్పిన్నర్ అశ్విన్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో 5 వికెట్లను సొంతం చేసుకోగా, మిగతా బౌలర్లందరూ తలో వికెట్ ను సొంతం చేసుకున్నారు.

ADVERTISEMENT

ఇక, ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండవ ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా మళ్ళీ తొలి ఇన్నింగ్స్ పరిస్థితే ఎదురయ్యింది. ఓపెనర్లు విజయ్ 3, రాహుల్ 10 పరుగులకే వెనుదిరగగా, మొదటి ఇన్నింగ్స్ లో జట్టు భారీ స్కోర్ లో కీలకపాత్ర పోషించిన పుజారా కూడా 1 పరుగుకే వెనుదిరగడంతో 40 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే కష్టమొచ్చిన ప్రతిసారి తానున్నానంటూ సత్తా చాటుతున్న విరాట్ కోహ్లి, ఇంగ్లాండ్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.

ఓ పక్కన స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పైన బ్యాటింగ్ చేయడమే కష్టంగా మారిన తరుణంలో… వేగంగా పరుగులు సాధిస్తూ చుక్కలు చూపించాడు కోహ్లి. ఆట ముగిసే సమయానికి 70 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో, నాలుగవ రోజు భారత ఆధిపత్యం కోహ్లి పైనే ఆధారపడి ఉందన్న విషయం స్పష్టమైంది. విరాట్ కు అండగా క్రీజులో రహనే 22 పరుగులతో రాణించాడు.

మొదటి ఇన్నింగ్స్ లో 167 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ కు బాటలు వేసిన కోహ్లి, రెండవ ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేసే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. కోహ్లి సత్తా చాటితే భారత విజయం తధ్యమన్న భావన ఇప్పటికే ప్రేక్షకాభిమానుల్లో నెలకొని ఉంది. మొత్తమ్మీద 298 పరుగుల ఆధిపత్యంలో ఉన్న భారత్ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. మరో 150 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను బరిలోకి దించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories