భారత్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచ కప్ చివరి ఘట్టానికి చేరుకుంది. ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్లకు వేదికగా నిలిచిన ఈ వరల్డ్ కప్ మరో 2 రోజుల్లో కొలిక్కి రాబోతుంది. భారత్ వరుసగా రెండవ సారి ఫైనల్ కు చేరి, సొంత గ్రౌండ్లలో ఫైనల్ ఆడుతున్న రెండవ జట్టుగా నిలిచింది.
అయితే టోర్నీ ప్రారంభానికి ముందు స్టార్-స్పోర్ట్స్ మరియు ఇతర ఛానెల్స్ తో పాటుగా అనలిస్టులు, క్రికెట్ దిగ్గజాలు చెప్పినట్టుగా మునుపెన్నడూ ఒక జట్టు వరుసగా రెండు టి-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న సందర్భాలు లేవు. అలాగే, ట్రోఫీ నెగ్గిన తరువాతి సీజన్ లో ఇప్పటిదాకా ఒక జట్టు ఫైనల్ కు చేరలేదు.
అలాగే, ఇప్పటివరకు టోర్నీ ను హోస్ట్ చేసిన జట్టు ఎప్పుడూ ట్రోఫీ ను ముద్దాడలేదు. ఇలా భారత జట్టు నేడు రెండు అతి పెద్ద నమ్మకాలను కూల్చగలిగిన స్థాయిలో ఉన్నారు. ఇటు పక్క భారత్ ఫుల్ ఫామ్ లో ఈ ఫైనల్ లో అడుగు పెట్టగా, మనవారి ముందు రెండు అడ్డుగోడలు ఉన్నాయి.
వాటిలో మొదటిది న్యూజిలాండ్ జట్టు. సెమి-ఫైనల్ లో ఇప్పటిదాకా ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని సఫారీలను చిత్తు చేసి ఇంటి దారి పట్టేలా చేశారు. ఆ జట్టుకు ఆయువుపట్టు లాంటి వారు తమ ఓపెనర్లు. ‘ఫిన్ అలెన్’ సెమి-ఫైనల్ లో సృష్టించిన విధ్వంసాన్ని చూసి భయపడని క్రికెట్ అభిమాని లేడు.
అలాగే, రెండవ అడ్డుగోడ మనం మ్యాచ్ ఆడనున్న గ్రౌండ్- ‘నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం’! ఈ మైదానం భారత్ లోనే కాదు, మొత్తం విశ్వంలోని అత్యంత ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన గ్రౌండ్ గా పిలువబడుతుంది. కానీ, ఈ గ్రౌండ్ గత 2 సార్లు భారత జట్టుకు చేదు అనుభవాలనే మిగిల్చింది.
2023 వన్-డే వరల్డ్ కప్ లో డ్రీమ్ రన్ కొనసాగిస్తున్న టీం ఇండియా, ఇదే గ్రౌండ్ వేదికగా ఆసీస్ తో ఫైనల్ లో తలపడగా, కలలో కూడా ఊహించని విధంగా ఓటమి చెందారు టీం ఇండియా. అయితే, రెండవగా ఇదే టి-20 వరల్డ్ కప్ లో సఫారీలు ఈ వేదికలో భారత్ ను చిత్తు చేసి, దాదాపు మనల్ని ఇంటికి పంపేసినంత పని చేశారు.
ఇలా భారత్ కళ్ళ ముందు రెండు అమూల్యమైన రికార్డులను నెలకొల్పగలిగిన అవకాశం ఉన్న వేల, ఈ రెండు భారీ సవాళ్లు కూడా ఎదురుచూస్తున్నాయి. మరి న్యూజిలాండ్ జట్టు ఇచ్చే కాంపిటీషన్ ను తట్టుకుని భారత్ కు శాపంగా మారిన నరేంద్ర మోడీ స్టేడియం లో టీం ఇండియా ట్రోఫీ ను ముద్దాడగలదా..? సెంటిమెంట్ ను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించగలదా.?







