‘ఇంట గెలిచి రచ్చ గెలవమన్న’ నీతి సూత్రాన్ని బ్లాక్ మనీ వెలికితీతలో ప్రధాని నరేంద్ర మోడీ అవలంభిస్తున్నట్లుగా కనపడుతోంది. ముందుగా స్విస్ ఖాతాల నుండి డబ్బులు వెలికి తీద్దామని సంప్రదింపులు జరిపినప్పటికీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో, దేశంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు నడుం కట్టిన విషయం తెలిసిందే. ఇటీవల చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా కుదేలవుతున్న నల్లకుభేరులను పూర్తిగా నియంత్రించేందుకు నరేంద్ర మోడీ మరో ముందడుగు వేసారు.
ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) ఒప్పందం అమలుకు సంయుక్త తీర్మానంపై భారత్ – స్విట్జర్లాండ్ మంగళవారం నాడు ఆమోదం తెలిపాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి చైర్మన్ సుశీల్ చంద్ర, స్విస్ దౌత్య కార్యాలయ ఉన్నతాధికారి గిల్స్ రౌడిట్లు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సెప్టెంబరు 2018 తర్వాత స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న భారతీయుల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడించనుంది.
సెప్టెంబరు 2019 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, స్విస్ బ్యాంకుల్లోని ఖాతాల్లో భారతీయులు దాచుకున్న నల్లడబ్బు వివరాలను స్విస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారత్కు అందిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందంపై స్విట్జర్లాండ్ ఆర్థిక విభాగం కూడా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏఈఓఐ అమలుకు స్విట్జర్లాండ్ కట్టుబడి ఉన్నట్టు, మరిన్ని దేశాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు వివరించింది.



