విశాఖ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఘనవిజయం సాధించింది. చివరి రోజు ఎలాంటి సంచలనాలు నమోదు కాకుండా తంతు ముగించడంలో ఇండియన్ బౌలర్స్ సూపర్ సక్సెస్ అయ్యారు. నాలుగవ రోజు రవీంద్ర జడేజా వేసిన చివరి బాల్ తో అవుట్ అయిన కుక్ పతనంతో మొదలైన ఇంగ్లాండ్ పతనం ఏ దశలోనూ కోలుకోలేదు. ఓవర్ నైట్ స్కోర్ 87/2తో ప్రారంభించిన స్కోర్ ను 158 పరుగుల వద్ద ముగించేసారు.
స్పిన్నర్లు అశ్విన్, యాదవ్ చెరో మూడు వికెట్లు సొంతం చేసుకోగా, షమీ, జడేజాలు చెరో రెండు వికెట్లు కొల్లగొట్టారు. ముఖ్యంగా రూట్ ను అవజేయడంలో షమీ వేసిన తెలివైన బౌలింగ్ భారత్ కు విజయాన్ని ఖరారు చేసింది. ఆ తర్వాత మరే ఇతర బ్యాట్స్ మెన్ కు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం లేకుండా పోయింది. బైర్ స్టో 34 పరుగులతో రాణించినప్పటికీ, మరో ఎండ్ లో వచ్చిన బ్యాట్స్ మెన్లు వచ్చినట్టే వెనుదిరిగారు. మొదటి ఇన్నింగ్స్ తొలి బంతి అవుట్ అయిన ఆండర్సన్ రెండవ ఇన్నింగ్స్ లోనూ తొలి బంతికే అవుట్ అయ్యాడు.
ఈ విజయంతో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఇండియా ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్ లలోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన విరాట్ కోహ్లి (167, 81)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. తొలి టెస్ట్ మ్యాచ్ డ్రా కావడంలో కూడా విరాట్ కోహ్లి (49 నాటౌట్) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కోహ్లి ఇదే రకమైన ఫాంను ప్రదర్శిస్తే సిరీస్ ను కైవసం చేసుకోవడం పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు.



