హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ సీజన్ 10 గ్రాండ్ గా ఆరంభమైంది. అమీ జాక్సన్ పాటల విందు కార్యక్రమం అనంతరం జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 35 పరుగులతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ధావన్ 40, హేన్రిక్స్ 52, యువరాజ్ 62ల అండతో ఏకంగా 207 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ముఖ్యంగా చివర్లో యువరాజ్ కేవలం 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడడంతో బెంగుళూరు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన బెంగుళూరు జట్టు తొలుత గట్టిపోటీనే ఇచ్చింది. తొలి 5 ఓవర్లలోనే 50 పరుగులకు చేరువ కావడంతో మ్యాచ్ రసకందాయంగా జరగడం ఖాయమని భావించారు. అయితే తొలి వికెట్ గా మనదీప్ సింగ్ ఔటైన తర్వాత వెంటనే గేల్ కూడా 32 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. అయితే ఆ తర్వాత కూడా జాదవ్, హెడ్ ల భాగస్వామ్యంతో 10 రన్ రేట్ మైంటైన్ చేసిన బెంగుళూరు జట్టు, జాదవ్ రనౌట్ కావడంతో, వికెట్ల పతనం ప్రారంభమైంది. 116 పరుగుల వద్ద 3వ వికెట్ గా జాదవ్ రనౌట్ కాగా, 172 పరుగులకు ఆలౌట్ అయిపోయింది.
గత సంవత్సరం జరిగిన ఫైనల్లో బెంగుళూరు ఖంగు తినిపించినట్లే, ఈ మ్యాచ్ లోనూ జలక్ ఇచ్చింది హైదరాబాద్ జట్టు. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి గానీ, బుల్లితెర ప్రేక్షకులకు కావల్సినంత కిక్ మాత్రం లభించలేదు. దీనికి ప్రధాన కారణం… ఐపీఎల్ కు కామెంటరీ చెప్తున్న వారంతా చాలా నీరసంగా, ప్రేక్షకులకు కావాల్సిన విధంగా అందించడంలో విఫలమయ్యారు. ఆసక్తి కలిగించలేని విధంగా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పిన కామెంటరీ, టీవీల ముందు కూర్చున్న వారి సహనాన్ని పరీక్షించింది.
ఓ పక్కన హైదరాబాద్ జట్టులో యువరాజ్ లాంటి ఆటగాళ్ళు భారీ షాట్లు కొడుతున్నా… ఉత్సాహం నింపలేని కామెంటరీ మున్ముందు మ్యాచ్ లకు ఆదరణ తగ్గేలా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కామెంటరీ విభాగంలో హర్ష బొగ్లె లేని లోటు ఖచ్చితంగా కనపడుతోంది. దీనికి అత్యుత్సాహం ప్రదర్శించే సంజయ్ మంజ్రేకర్ మరియు మరో లేడీ కామెంటరీ కర్ణకఠోరంగా మారడంతో ప్రేక్షకులు ‘మ్యూట్’లో పెట్టుకుని మ్యాచ్ ను తిలకించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పోనీ ఇంగ్లీష్ కాకుండా మరో ఛానల్ వీక్షిద్దామా అంటే… మరో దాంట్లో భరించలేని తెలుగు కామెంటరీ ఉండడం… ఆ ఛానల్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తోంది.



