‘కింగ్స్’ ఆశలు సజీవం… ఉత్కంఠలో సన్ రైజర్స్..!

IPL 2017 - Kings XI Punjab vs Kolkata Knight Ridersప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అనూహ్య విజయం సాధించి, ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిజానికి పంజాబ్ జట్టు చేసిన స్కోర్ ను అవలీలగా చేధిస్తుందనుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ ను కింగ్స్ స్పిన్నర్లు నిలువరించడంలో సక్సెస్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తొలి 10 ఓవర్లలో 6 రన్ రేట్ తో మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది.

ADVERTISEMENT

ఈ తరుణంలో కెప్టెన్ గ్లెన్ మాక్స్ వెల్ 25 బంతుల్లో 44 పరుగులు చేయడంతో కాస్త గాడిలో పడింది. అయితే మళ్ళీ ఇన్నింగ్స్ ఊపందుకుంటున్న సమయంలో మాక్స్ వెల్ వెనుతిరగగా, సాహా 33 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. ఇక చివర్లో టివేటియా మూడు బౌండరీలు సాధించి, పంజాబ్ స్కోర్ ను 167 పరుగులకు చేర్చాడు. ఓ మాదిరి లక్ష్యాన్ని భారీ స్థాయిలో ఆరంభించింది కోల్ కతా. ఎప్పటి మాదిరిగానే ఓపెనర్ సునీల్ నరైన్ చెలరేగగా, మరో ఎండ్ లో ఉన్న క్రిస్ లైన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు.

అయితే సునీల్ నరైన్ ఔటైన తర్వాత కోల్ కతా బ్యాట్స్ మెన్లు క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. లైన్ ఒక్కడే 52 బంతుల్లో 84 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసాడు. నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో కింగ్స్ స్పిన్నర్లు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా టివేటియా నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లను దక్కించుకున్నాడు. అప్పటి నుండే మ్యాచ్ పంజాబ్ వైపుకు టర్న్ అయ్యింది. అక్సర్ పటేల్, మోహిత్ శర్మ, సందీప్ శర్మలు కూడా చక్కని సహకారం అందించడంతో విజయం పంజాబ్ వశమైంది.

ఈ గెలుపుతో ఆడిన 12 మ్యాచ్ లలో 12 పాయింట్లు సొంతం చేసుకుంది పంజాబ్ జట్టు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠతో 11వ తేదీన ముంబైతో తలపడనున్న పంజాబ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. మరో మ్యాచ్ పూణేతో ఉండగా, ఈ రెండు మ్యాచ్ లలో కూడా విజయం సాధిస్తే… పంజాబ్ ప్లే ఆఫ్స్ కు అర్హత పొందే అవకాశం ఉంది. అయితే ఆ రెండు మ్యాచ్ లు కూడా బలమైన జట్లతో కావడం విశేషం. ఒకవేళ ఈ రెండు మ్యాచ్ లలో ఏ ఒక్క మ్యాచ్ లో పరాజయం పాలైనా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరిపోతుంది, అలాగే పంజాబ్ ఇంటికెళ్ళిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories