అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ పక్క “ఇరాన్తో యుద్ధం ముగిసిపోయింది… శాంతిచర్చలు జరుగుతున్నాయి. హోర్మూజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుంది,” అని చెపుతూనే పశ్చిమాసియాకు 3,500 మంది సైనికులను, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలతో కూడిన విమాన వాహక నౌకలను, భారీగా ఆయుధాలు తరలిస్తున్నారు.
ఇరాన్కు అత్యంత కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికే ఈ ప్రయత్నాలని అర్ధమవుతూనే ఉంది. హోర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్కు విధించిన 48 గంటల గడువుని మొదట 5 రోజులకి తర్వాత మరో 10 రోజులకి పొడిగించడం యుద్ధ సన్నాహాలకు సమయం పొందడం కోసమేనని అర్ధమవుతూనే ఉంది.
ఇరాన్ కూడా అమెరికాను ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది. “ఖర్గ్ ద్వీపంలో అడుగుపెట్టేందుకు వస్తున్న అమెరికన్ సైనికులకు సుస్వాగతం. మీ కోసం శవపేటికలు సిద్దంగా ఉన్నాయి. వాటిలోనే మీరు స్వదేశానికి తిరిగి వెళ్తారు,” అంటూ ఇరాన్ మీడియా ప్రకటించింది.
భౌగోళికంగా చాలా సంక్లిష్టమైన ద్వీపం ఖర్గ్. సముద్ర తీరం వెంబడి ఎత్తయిన కొండలు, మరోవైపు భయంకరమైన ఎడారి, మూడోవైపు శరవేగంగా మారిపోయే వాతావరణం నెలకొని ఉంటుంది. కనుక ఇరాన్తో 8 ఏళ్ళు ఏకధాటిగా యుద్ధం చేసిన ఇరాక్ కూడా ఖర్గ్ ద్వీపం జోలికి పోలేదు. కానీ ఇప్పుడు అమెరికన్ సైనికులు అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కనుక ఇరాన్ హెచ్చరికలు నిజమవుతాయా?లేదా అమెరికన్ సైనికులు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని, దాంతో పాటు హోర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుని ఇరాన్ యుద్ధంలో అమెరికాని గెలిపిస్తారా?






