గత నెల 18న విశాఖ సాగర తీరంలో జరిగిన ఫ్లీట్ రివ్యూలో దేశవిదేశాలకు చెందిన యుద్ధనౌకలు పాల్గొన్నాయి. వాటిలో ఇరాన్కు చెందిన ఐరిస్ దేనా-75 కూడా ఒకటి. విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన నేవీ పరేడ్లో ఇరాన్ బృందానికి నేవీ కమాండర్ షేకతి నాయకత్వం వహించారు. ఆ పరేడ్లో పాల్గొని అందరినీ అలరించినవారిలో కేవలం 32 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు.
ఫ్లీట్ రివ్యూ ముగిసిన తర్వాత ఐరిస్ దేనా-75 స్వదేశానికి తిరిగి వెళుతుండగా బుధవారం శ్రీలంక సమీపంలో అమెరికన్ సబ్ మెరైన్ దానిపై దాడి చేసి ముంచేసింది. ఈ దాడిలో 87 మంది చనిపోయారు. మరో 68 మంది గల్లంతయ్యారు. ఇరాన్ యుద్ధనౌక మునిగిపోతుండటం గమనించిన శ్రీలంక కోస్ట్ గార్డ్ అక్కడకు చేరుకొని దానిలో 32 మందిని కాపాడింది. చనిపోయిన 87 మంది మృతదేహాలను కూడా బయటకు తీశారు. మిగిలినవారి కోసం సముద్రంలో గాలించినా ఆచూకీ లభించలేదు. ఆ యుద్ధనౌకపై అమెరికా సబ్ మెరైన్ దాడి చేసిందని రక్షణ మంత్రి పీట్ హెగేత్స్ ధ్రువీకరించారు.
మూడు వారాల క్రితం విశాఖలో తమ విన్యాసాలు, బ్యాండ్తో అందరినీ అలరించిన ఐరిస్ దేనా-75లో ఇరాన్ నేవీ సిబ్బంది ఈవిధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరం. అమెరికాకు ఇది గొప్ప విజయంగా అనిపించవచ్చు. కానీ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి స్వదేశానికి వెళుతున్న వారిపై తమ ప్రతాపం చూపి ప్రాణాలు బలిగొనడం చాలా దారుణం.
ఐరిస్ దేనా-75పై అమెరికా దాడిలో ఇరాన్ నేవీ సిబ్బంది మరణించిన వార్త తెలిసిన తర్వాత, ఫ్లీట్ రివ్యూలో వారు పాల్గొన్నప్పటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







