ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రధాన పార్టీలైన వైసీపి, టిడిపి, జనసేనలు తమ రాజకీయ కార్యాచరణ, ఎన్నికలపై పూర్తి స్పష్టతతో ఉన్నాయి కానీ బీజేపీ పరిస్థితే అయోమయంలో ఉండిపోయింది. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాట్లు చేసుకుంటుండటం, వాటితో పొత్తు పెట్టుకోవాలో వద్దో అధిష్టానం స్పష్టత ఈయకపోవడమే ఈ అయోమయానికి కారణం.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శాసనసభ, లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో 25 జిల్లాలను 5 క్లస్టర్లుగా విభజించి, వాటికి ఇన్చార్జిలను నియమించారు. నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు.
ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం మంచి రోజు అని విశాఖ (ఉత్తరం) నియోజకవర్గంలో శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.
ఈ రెండు పరిణామాలను కలిపి చూస్తే, ఈసారి బీజేపీ ఏపీలో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నట్లు భావించవచ్చు.
టిడిపి, జనసేనలు మొదట బీజేపీతో కూడా తమతో కలిసిరావాలని కోరుకున్నప్పటికీ, బీజేపీ కూడా తమ కూటమిలో చేరితే సీట్ల సర్దుబాట్లు ఇంకా కష్టమవుతుందని, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళితే, మైనార్టీలు వైసీపివైపు వెళ్లిపోయే అవకాశం ఉందని భావిస్తున్నాయి.
కనుక బీజేపీ తమకు దూరంగా ఉంటూనే ఎన్నికలలో సహకరించాలని ఆశిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ వేస్తున్న అడుగులు కూడా అదేవిదంగా ఉన్నాయి. ఫిబ్రవరి 2,3 తేదీలలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తుల విషయంపై పూర్తి స్పష్టత రావచ్చు.




