ఆంజనేయస్వామికి తన బలం తెలియన్నట్లే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా తాను ఎంత శక్తివంతుడినో తెలీదు పాపం. కానీ ఆయన ప్రధాని నరేంద్రమోడీ కంటే చాలా శక్తివంతుడు. ఈవిషయం వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి, వారి సొంత మీడియా ఎప్పటికప్పుడు కనిపెట్టి చెపుతూనే ఉంది కానీ ఎవరూ పట్టించుకోరు.
నాడు సోనియా గాంధీని తన చెప్పుచేతలలో పెట్టుకొని జగన్పై సీబీఐ చేత అక్రమాస్తుల కేసులు పెట్టించారు. ఆ తర్వాత ఆయన సీబీఐని తన చెప్పు చేతలలో ఉంచుకొని చిన్న పిల్లోడు, ప్రజలకు మేలు చేయాలనే మరో ఆలోచన తప్ప మరేమీ తెలియని అమాయకుడైన అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో ఇరించేందుకు ప్రయత్నించారు.
పవన్ కళ్యాణ్కి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని టిడిపితో పొత్తుపెట్టుకునేలా చేశారు. అలాగే ప్రధాని నరేంద్రమోడీకి మాయమాటలు చెప్పి టిడిపితో బీజేపీ పొత్తుపెట్టుకునేలా చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు వచ్కిన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతగా అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని అనేశారు.
చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రధాని నరేంద్రమోడీ ఈసీని ఆయనకు అప్పగించేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈసీని చెప్పు చేతల్లో పెట్టుకొని రాష్ట్రంలో పోలీస్ అధికారులను తన ఇష్టం వచ్చిన్నట్లు మార్చేస్తున్నారు!
ఏపీలో ఇంకా జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ పోలీసులు చంద్రబాబు నాయుడి ఆదేశాలే పాటిస్తున్నారు తప్ప వైసీపి నేతలని పట్టించుకోవడం లేదు.
కేంద్ర ఎన్నికల కమీషనే చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ లెక్కా? అందుకే చంద్రబాబు నాయుడు ఆడమన్నట్లు అది ఆడుతోంది.
పల్నాడులో పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాలన్నిటినీ చంద్రబాబు నాయుడు తన అధీనంలోకి తీసుకొని, ఆన్-ఆఫ్ బటన్లు తన చేతిలో పెట్టుకొని టిడిపి మూకల చేత ఇష్టం వచ్చిన్నట్లు రిగ్గింగ్ చేయించుకున్నారు.
నారా లోకేష్ విదేశాలలో కూర్చొని ఆ వీడియోలను ఎడిటింగ్, మార్ఫింగ్ చేయిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే, వాటి ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డితో సహా పలువురు వైసీపి నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది!
పిన్నెల్లి హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే, కౌంటింగ్లో సమయంలో ఆయనను మాచర్లలో అడుగుపెట్టనీయకుండా చంద్రబాబు నాయుడు చేశారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడే ఇంత శక్తివంతుడని కనిపెట్టి చెపుతున్న వైసీపికి, దాని మీడియాకి ఆయనతో సహా టిడిపి నేతలందరూ కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.




