జగన్ ప్రతిపక్షానికే కానీ పాలకపక్షానికి సరిపోడని స్వయంగా ఆయనే తన చర్యల ద్వారా నిరూపించుకుంటున్నారు. ప్రతిపక్షములో ఉన్నన్నాళ్లు ప్రజల మధ్య రాజకీయం చేస్తున్న జగన్ అధికారం రాగానే అదే ప్రజలను పక్కన పెట్టి ఐప్యాక్ టీం లతో, సలహాదారుల సలహాలతో పాలన కొనసాగించారు.
2014 ఎన్నికలో ఓడిన వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమవ్వడంతో పాదయాత్రలు, నిరశన యాత్రలు, ప్రత్యేక హోదా ధర్నాలు, ప్రెస్ మీట్లు అంటూ నిత్యం అందరికి అందుబాటులో కనిపిస్తూ ఉండే వారు. ఒక్కసారి 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రిగా జగన్ దర్శన భాగ్యం సొంత పార్టీ నేతలకు సైతం దక్కలేదు.
ఇక బటన్ నొక్కడానికి తప్ప జగన్ ఎన్నడూ తాడేపల్లి ప్యాలస్ గడప దాటిందే లేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో ముఖ్యమంత్రిగా జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిందే లేదు. అడపాదడపా బహిరంగ సభలలో పాల్గొన్న జగన్ అప్పుడు కూడా తన ప్రసంగాలతో, తన తెలుగు భాషతో సోషల్ మీడియాకు ఆహారమయ్యే వారు. కనీసం తన సొంత సాక్షిలో కూడా గడిచిన ఐదేళ్లలో ప్రజలను ఉద్దేశించి జగన్ ఒక్క ఇంటర్ వ్యూ కూడా ఇచ్చిన పాపాన పోలేదు.
సరిగ్గా అధికారానికి దూరమై నెల రోజులలోపే దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్న జగన్ ఐదేళ్ల తరువాత జాతీయ మీడియా ముందు మొదటిసారిగా తన గళం వినిపించారు. అయితే వాటిలో వాస్తవాల శాతం ఎంతన్నది పక్కన పెడితే స్క్రిప్ట్ పేపర్ లేకుండా 5 నిముషాలు అనర్గళంగా మీడియా ముందు జగన్ ప్రసంగించగలిగారు.
అధికారంలో ఉన్నన్నాళ్ళు బాబు, పవన్ లను తిట్టాలన్న కూడా కళ్ళ ముందు స్క్రిప్ట్ ఉండాల్సిందే అనేలా వ్యవహరించిన జగన్, ప్రతిపక్షానికి రాగానే తన సమర్థతను పెంచుకుంటున్నారా? లేక బయటపెడుతున్నారా? అనే మీమాంసలో ఉన్నారు వైసీపీ నేతలు. తాజాగా తన తాడేపల్లి ప్యాలస్ నుండి మీడియా ముందుకు రానున్నారు జగన్.
కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ విధానాల పై అన్ని శాఖల మీద ఎప్పటికప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వైసీపీ అవినీతిని బయటపెడుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ కూటమి ప్రభుత్వ విమర్శలకు అసెంబ్లీకి వెళ్లి కౌంటర్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అక్కడ తనకు ప్రతిపక్ష నేత హోదా లేకపోయింది అనే బాధలో తన ఇంటి నుండే ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దీనితో అధికారంలో ఉన్నప్పుడు కనిపించని మీడియా ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే కనిపించిందా అంటూ జగన్ పై విమర్శలు మొదలయాయ్యి.
గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్రంలో ఎన్ని దారుణాలు జరిగిన, ఎన్ని విధ్వంసాలు చోటు చేసుకున్న, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన కనీసం మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వలేకపోయిన జగన్ ప్రతిపక్షానికి రాగానే తన పంథా మార్చుకుని మీడియా ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దుష్ట చతుష్టయం అంటూ నిందలు వేసిన జగన్ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఎం చెప్పాలనుకుంటున్నారు.
జగన్ కు ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలు, మీడియా అందరు గుర్తొస్తున్నారు. దీనితో జగన్ తన సమర్థతను నిరూపించుకోవాలన్నా, వైసీపీ ని కాపాడుకోవాలన్న ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండడమే సరైన నిర్ణయమనే సలహాలు వినపడుతున్నాయి.




