
ఇదీ మన తెలుగు సినీ పరిశ్రమ తాజా పరిస్థితి! ఒకప్పుడు మద్రాసులో ఓ వెలుగు వెలిగినప్పుడూ అపూర్వమైన గౌరవం పొందింది. హైదరాబాద్కు తరలివచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాల సమయంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ, తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చంక నెక్కించుకోవడంతో ఇంతకాలం హాయిగానే సాగిపోయింది.
కానీ ఇప్పుడు రెవ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆటుపోట్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంధ్య థియేటర్ ఘటన తదనంతర పరిణామాలే తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితిని ఒక్కసారిగా తారుమారు చేశాయని అందరికీ తెలుసు.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
ఇటువంటి పరిస్థితులలో నిర్మాత దిల్రాజు ఎఫ్డీసీ ఛైర్మన్గా ఉండటం ఒక్కటే సినీ పరిశ్రమకు కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఆయనే మద్యలో లేకపోయి ఉంటే పరిస్థితి మరింత దిగజారిపోయేదేమో?
కానీ సినిమాల ప్రీ రిలీజ్ షోలు, అదనపు షోలు, టికెట్స్ ధరలు పెంపు వంటివన్నీ ఇప్పుడు హైదరాబాద్లో అసాధ్యం, అసంభవం అన్నట్లు మారిపోవడంతో తెలుగు సినీ పరిశ్రమ విలవిలలాడుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్తో తీసిన సినిమాలు ఈ దెబ్బకి విలవిలలాడుతున్నాయి!
Also Read – మోడీ “లీగల్లీ కన్వర్టర్ బీసీ”..?
ఓ పెద్ద హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సినీ అభిమానులకు ఓ పండుగ వంటిదే. కానీ తెలంగాణలో సినీ అభిమానులు ఇప్పుడు వాటికి కూడా నోచుకోలేదు.
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. డాకూ మహరాజ్ అనంతపురంలో జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేసిన ‘తండేల్’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో శ్రీరామ టాకీస్లో విడుదల కాబోతోంది. దీని కోసం నాగ చైతన్య తదితరులు కొద్దిసేపటి క్రితమే విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయబోతున్నారు.
Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?
సినీ పరిశ్రమలో హైదరాబాద్లో ఉంటూ అక్కడ సినిమాలు తీస్తూ, వాటి ఈవెంట్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చి జరుపుకోవలసివస్తోంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు ఏపీలో ఆడించుకోవడం కత్తి మీద సామూలా ఉండేది.
కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమాలకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతుంటే, తెలంగాణ ఇటువంటి పరిస్థితి నెలకొనడం బాధాకరమే. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం బాధపడుతోందో లేదో తెలీదు కానీ అక్కడి సినీ అభిమానులకు మాత్రం తప్పక బాధ కలుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ తెలుగు సినీ పరిశ్రమని ఏపీ ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా సినిమా పిచ్చోళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకునేందుకు సిద్దంగా ఉన్నారు.
కనుక సినీ పరిశ్రమ ఒకేసారి కాకపోయినా మెల్లగా అమరావతికో లేదా విశాఖ లేదా తిరుపతికో తరలివస్తే అందరికీ సంతోషం. సినీ పరిశ్రమకి సముచిత ప్రేమాభిమానాలు, గౌరవమర్యాదలు లభిస్తాయి కదా?