సమ్మె చేస్తారట! సచివాలయాలు అవసరమా?

village-secretariate-offices

జగన్‌ మానస పుత్రికలు మూడు రాజధానులు, వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు, సంక్షేమ పధకాలు. ఈ నాలుగింటి వలన రాష్ట్రానికి, ప్రజలకు అదనపు భారమే తప్ప ఒరిగిందేమీ లేదు.

జగన్‌ మూడు రాజధానులు ఏర్పాటు చేయలేకపోయినా 5 ఏళ్ళు నిరాటంకంగా అమరావతి నుంచే పాలన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు.

ADVERTISEMENT

వాలంటీర్లు లేకపోతే ప్రజలకు సంక్షేమ పధకాలు అందవనే జగన్‌ వాదన అర్దరహితమని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు.

ప్రజలకు సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతూ ఎప్పటికీ ప్రభుత్వంపై ఆధారపడి ఉండేలా చేయడం కాదు. పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకువచ్చి వాటిలో ఉద్యోగాలు, ఉపాధితో ఎవరి కాళ్ళపై వారు నిలబడెలా చేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నారు.

సచివాలయ వ్యవస్థలు లేనప్పుడూ ప్రజలకు సేవలందించేందుకు మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలు, పంచాయితీలు మొదలు కార్పొరేషన్ల వరకు ఎక్కడికక్కడ కార్యాలయాలు ఉన్నాయి.

కానీ వాటికి సమాంతరంగా జగన్‌ సచివాలయ వ్యవస్థలని సృష్టించారు. అవి వైసీపీ నేతలకు కార్యాలయాలుగా ఉపయోగపడ్డాయి.

అయినప్పటికీ వందల కోట్లు ఖర్చుతో వాటిని ఏర్పాటు చేశారు కనుక సిఎం చంద్రబాబు నాయుడు వాటిని రద్దు చేసేయకుండా మరింత సమర్ధంగా వినియోగించుకోవాలని అనుకున్నారు.

అందుకే జనాభా ప్రాతిపదికన సచివాలయ సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరం లేని చోట ఎక్కువగా ఉన్న సిబ్బందిని, అవసరమైన చోట తక్కువ సిబ్బందితో నడుస్తున్న సచివాలయాలకు బదిలీ చేస్తోంది.

అలాగే ఉద్యోగులను టెక్నికల్, నాన్-టెక్నికల్‌గా విభజించి తదనుగుణంగా వారి సేవలను అవసరమైన సచివాలయాలలో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ ఈ నిర్ణయాల వలన తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని, తమ పదోన్నతులపై కూడా ప్రభావం పడుతుందంటూ సచివాలయ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్దమవుతున్నాయి. అవి జగన్‌ సృష్టించినవే కనుక వైసీపీ వారికి మద్దతుగా సొంత మీడియాలో వితండ వాదనలు వినిపిస్తూ, యధాప్రకారం సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తోంది.

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం బదిలీ చేసినప్పుడు వారు మారుమాట్లాడకుండా బదిలీపై వెళుతుంటారు. వారందరికీ లేని అభ్యంతరం సచివాలయ సిబ్బందికే ఎందుకు?

నేటికీ వైసీపీతో అంటకాగుతూ ఆ పార్టీ నేతల దన్నుతో సమ్మెకు సిద్దమవుతున్న సచివాలయ సిబ్బందిని భరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా?ఆలోచిస్తే మంచిది. సచివాలయ సిబ్బంది కూడా ప్రభుత్వానికి లోబడి పనిచేయడం అలవరుచుకుంటే మంచిది. లేకుంటే వాళ్ళు కూడా వాలంటీర్లలా రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories