చంద్రబాబు నాయుడు జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 13న బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. అయినప్పటికీ రెండు నెలల్లోనే ఆయన అనేక పనులు చక్కబెట్టారు.
ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అమరావతి, పోలవరం పనులకు అవసరమైన నిధులు సిద్దం చేసుకొని, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండు నెలల్లో ఏమి చేశారో ఓసారి పరిశీలిస్తే, మొట్ట మొదట ఉండవల్లిలో ప్రజావేదికని కూల్పించేశారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు నిలిపివేశారు.
అమరావతి భ్రమరావతి అంటూ నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపించేసి అందరినీ తరిమేశారు. అవసరం లేని సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థని సృష్టించారు. సంక్షేమ పధకాలకు బటన్ నొక్కడం మొదలు పెట్టారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల రెండు నెలల పనితీరులో ఇంత తేడా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మొదటి రెండు నెలల్లో ఏమేమి చేశారో చెప్పుకుంటే ఆయన ముందు జగన్ దిగదుడుపే అని అర్దమవుతుంది.
రాజకీయ ప్రతీకారాల విషయంలో తప్ప జగన్ మరే కార్యక్రమం చేపట్టినా చిత్తశుద్దితో చేయరు. తాను ఎంతో గొప్పగా చెప్పుకున్న సంక్షేమ పధకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని నమ్మబలికినా కాదని జగన్కు కూడా తెలుసు.
ఆ పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ వైసీపి ఓటు బ్యాంక్ నిర్మించుకోవాలని పెద్ద ఎత్తు వేశారు. జగన్ దురాలోచనని లబ్ధిదారులు కూడా పసిగట్టారు. అందుకే ఆరు కూడా ఎన్నికలలో జగన్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారని చెప్పవచ్చు. కానీ ఆ విషయం మరిచి తల్లికి వందనం అన్న చంద్రబాబు నాయుడు అప్పుడే ఆ పధకాన్ని పక్కన పెట్టేసి తల్లికి ఎగనామం పెట్టారంటూ వైసీపి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది.
అయితే ఆ పధకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఆర్ధిక సాయం అందిస్తామని మంత్రి నారా లోకేష్ శాసనసభలో చేసిన ప్రకటనని పట్టించుకోకుండా ఈవిదంగా దుష్ప్రచారం చేయడం చూస్తే వైసీపి నీచ రాజకీయాలు ఏవిదంగా ఉంటాయో అర్దమవుతుంది.
జగన్ ముఖ్యమంత్రిగా విఫలం అయ్యారు సరే… కనీసం ప్రతిపక్ష నేతగా అయినా సరిగ్గా వ్యవహరిస్తున్నారా?అంటే కాదనే చెప్పవచ్చు.
శాసనసభలో బలం లేకపోయినా తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇప్పించాలని కోరుతుండటం, అది కోరుతూ శాసనసభ సమావేశాలకు మొహం చాటేయడం, వినుకొండ ఘటనతో శవ రాజకీయాలు చేయడం, ఢిల్లీలో ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీయాలనుకోవడం… ఇవన్నీ జగన్ నెల్లన్నర రోజులలోనే చేసిన ఘన కార్యాలు.
వైసీపి అధినేతగా, ఓ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా విఫలమైనా కూడా కూడా జగన్మోహన్ రెడ్డి తీరు మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా పనిచేస్తున్న టిడిపి కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో, బయటా కూడా బురద జల్లుతుండటం జగన్ విచిత్ర మనస్తత్వానికి నిదర్శనం కాదా?




