బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకులలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకరు. ఆయన కల్వకుంట్ల కవితపై సెటైర్లు వేస్తున్నా కేసీఆర్ పట్టించుకోకుండా పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత స్వయంగా ఈ మాటన్నారు.
అటువంటి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ విధానాల గురించి చెపితే అది నూటికి నూరు శాతం నిజమే అని భావించక తప్పదు. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రాంతీయత (ప్రాంతీయవాదం), జల దోపిడీ (ఏపీతో నీళ్ళ పంపకాలు) విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడూ ఒకేలా ఉంది. ఎటువంటి మార్పు లేదు.
మా హయంలో కాళేశ్వరంతో సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాము. న్యాయంగా మా వాటా నీళ్ళే మేము వాడుకున్నాము. అధనంగా వచ్చిన వరద నీటిని కూడా వాడుకున్నాము. అదనపు వరద నీటిని వాడుకుంటే తప్పు కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నుంచి 80 టిఎంసిలు వాడుకుంటోంది. అవి సరిపోకపోతే 80 కాకపోతే 160 అవీ సరికపోతే 320 టిఎంసిలు వాడుకోండి. మాకేమీ అభ్యంతరం లేదు.
కానీ వరద జలాల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు, కాలువలు నిర్మించుకొని నికర జలాలను తరలించుకుపోయే కుట్రలు చేస్తోంది. దానినే మేము వ్యతిరేకిస్తున్నాం.
ఏపీ ప్రభుత్వం జల దోపిడీకి పాల్పడుతుంటే ఇక్కడి మా అసమర్ద ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందువల్లే మేము బనకచర్ల ప్రాజెక్టుని గట్టిగా అడ్డుకోవలసి వచ్చింది.
మా పార్టీకి మా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. వాటిని కాపాడుకునేందుకు ఎవరితోనైనా పోరాడేందుకు సిద్దం,” అని జగదీష్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం రాజధాని హైదరాబాద్తో సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు, వరదలతో జలామయమైంది. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువ (ఆంధ్రా)కు విడుదల చేస్తున్నారు. వాటిని ఆంధ్రా ప్రభుత్వం కూడా వాడుకోలేక గేట్లుఎత్తి సముద్రంలోకి విడిచిపెట్టేస్తోంది.
ఇదేమీ రహస్యంగా జరుగుతున్నది కాదు. రోజూ టీవీ వార్తలలో కళ్ళకు కట్టినట్లే చూపిస్తున్నారు. కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకోలేనంతగా వరద జలాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.
కనుక ఆ వరద నీటినే రాయలసీమ జిల్లాలకు మళ్ళించేందుకు సిఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించారు. దీని వలన తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ లేదని పదేపదే చెపుతున్నారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ మనుగడ కోసం, అక్కడ కాంగ్రెస్పై పైచేయి సాధించేందుకు నీళ్ళ పేరుతో, చంద్రబాబు నాయుడు బూచిగా చూపిస్తూ రాజకీయాలు చేస్తూనే ఉంది. ఇదెలా ఉందంటే భారత్లో ఎన్నికలు జరుగుతుంటే పాకిస్థాన్ని బూచిగా చూపినట్లే ఉంది.
“వరద నీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ ప్రాజెక్టులు కట్టరాదు… కాలువలు తవ్వరాదు,” అని జగదీష్ రెడ్డి చెప్పడం నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లే ఉంది? అయినా ప్రాజెక్టులు, కాలువలు లేకుండా వరద నీటిని రాయలసీమకు ఏవిదంగా తరలించాలో కూడా ఆయనే చెపితే బాగుంటుంది కదా?





