అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీలైనా తమ మనసులో ఆలోచనలు, కోరికలనే ప్రజలకు ఆపాదిస్తూ వాటిని ప్రజాభిప్రాయంగా అభివర్ణిస్తుంటాయి.
అధికార పార్టీలు మన పాలన అద్భుతంగా ఉందని ప్రజలు మెచ్చుకుంటున్నారు. మన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పుకుంటాయి.
ప్రతిపక్షాలు ఇందుకు పూర్తి భిన్నంగా.. రాష్ట్రం అన్ని రంగాలలో భ్రష్టు పట్టిపోతోంది. ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ పాలనతో వేసారిపోయారు. కనుక అధికార పార్టీని గద్దె దించి మళ్ళీ మనకి అధికారం అప్పజెప్పుదామా? అని ఆత్రుతగా రోజులు లెక్కపెట్టుకుంటూ ఎదురు చూస్తున్నారని చెప్పుకుంటాయి.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాగే నడుస్తోంది. తెలంగాణ చర్చ ఇప్పుడు అనవసరం.
మన రాష్ట్రం సంగతే చూసుకుంటే, కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే చెప్పుకుంటున్నప్పటికీ, అది చేస్తున్న అభివృద్ధి పనులు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. పరిశ్రమలు, ఐటి కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సాగుతాగు నీరు అందిస్తోంది.
కేవలం సంక్షేమ పధకాలు అమలు చేస్తే చాలు..ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా తేల్చి పడేశారు కదా? కూటమి ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పధకాలు కూడా అమలు చేస్తోంది కనుక రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నట్లే కదా?కానీ జగన్ అంగీకరించడం లేదు.
ముందే చెప్పుకున్నట్లు, చంద్రబాబు నాయుడు పాలనతో ప్రజలు వేసారిపోయారని, అన్ని రంగాలు భ్రష్టు పట్టాయని, కనుక జగన్ 2.0 ఒక్కటే ఆంధ్రప్రదేశ్ని.. ప్రజలను కాపాడగలదని బల్లగుద్ది చెపుతున్నారు.
కనుక వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో పాదయాత్ర చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో ప్రజలు కళ్ళు మూసుకొని వైసీపీకి ఓట్లు గుద్దేసి తనని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారని వైసీపీ నేతలకు చెపుతున్నారు.
కనుక 175/175తో ఏవిధంగా కళ్ళు మూసుకొని ఎన్నికలకు వెళ్ళామో, అదేవిధంగా ఈసారి జగన్ 2.0తో వెళ్దామని, అంతవరకు అందరూ కళ్ళు మూసుకొని ఇలాంటి పగటి కలలు కనమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చి పంపారు.
సొంత పార్టీ… దానికో సొంత మీడియా ఉంటే మనసులో కలిగే ఇలాంటి ఆలోచనలు, కోర్కెలను అచ్చేసి చూసుకొని మురిసిపోవచ్చు. కానీ ప్రజలకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా లేవా? రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు మన పగటి కలలకు అనుకూలంగా ఉన్నాయా లేవా?అని కూడా ఆలోచించగలిగితే అనేక వాస్తవాలు కనపడతాయి.
కానీ మనం అనుకున్నదే జనం కూడా అనుకుంటున్నారు… మన అభిప్రాయమే ప్రజాభిప్రాయం అని అనుకుంటే, చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది.. అధికార పార్టీలకైనా… ప్రతిపక్ష పార్టీలకైనా!





