ఎన్నికలలో ఓడిపోయినా, 175కి బదులు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా, వైసీపికి సుమారు 40 శాతం ఓట్లు వచ్చాయి కనుక నైతికంగా మేమే నెగ్గానని జగన్ గొప్పగా చెప్పుకున్నారు. అటువంటిది విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి తప్పుకోవడంతో ఏకగ్రీవంగా గెలిచి టిడిపి గర్వం అణిచివేశామని చెప్పుకోవడం పెద్ద విశేషం కాదు.
అదేవిదంగా అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం బాధితులకు కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేయడం వలననే చంద్రబాబు నాయుడుకి ఇవ్వక తప్పలేదని చెప్పుకోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు.
కానీ మొన్న బొత్స సత్యనారాయణ, నిన్న జగన్ ఫార్మా బాధితులను పరామర్శించినప్పుడు, టిడిపి కూటమి స్పందించిన తీరు, వ్యవహరించిన తీరు రెండూ సరిగ్గా లేవని విమర్శించిన విషయం మరిచిపోయిన్నట్లున్నారు.
కోటి రూపాయల క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలనే అత్యుత్సాహంలో “జగన్ డిమాండ్ చేసిన 24 గంటలలోపే చంద్రబాబు నాయుడు బాధితులకు కోటి రూపాయలు చొప్పున అందజేశారని’ సోషల్ మీడియాలో వైసీపి చాటింపు వేసింది. అంటే టిడిపి కూటమి ప్రభుత్వం బాధితులకు 24 గంటల్లోపే నష్టపరిహారం చెల్లించిందని వైసీపి స్వయంగా ధృవీకరించిందన్న మాట!
అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు క్షతగాత్రులను సమీపంలో ఉన్న అనకాపల్లికి తరలించి చికిత్స అందించడాన్ని కూడా తప్పు పడుతూ పోస్టులు పెట్టిన వైసీపియే, ఇప్పుడు జగన్ అనకాపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారంటూ గొప్పగా పోస్టులు పెట్టింది. అంటే ఈవిషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం సరైనదేనని కానీ తమ పార్టీ నేతలు, తమ సోషల్ మీడియా బృందం అత్యుత్సాహం ప్రదర్శించారని స్వయంగా ఒప్పుకున్నట్లయింది కదా?
శవ రాజకీయాలు, ఓదార్పు రాజకీయాలు చేయడం, వాటితో రాజకీయ మైలేజీ పొందాలనుకోవడం జగన్కి కొత్తేమీ కాదు. అచ్యుతాపురం ఘటన, బాధితుల విషయంలోనూ అదే చేశారు.
అదేవిదంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తూ ఆయనను ద్వేషిస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అదే చేస్తున్నారు.
ఏదో సాకుతో చంద్రబాబు నాయుడుని విమర్శించాలనే తాపత్రయంతో చేస్తున్న ఇటువంటి ప్రచారంతోనే ఆయన నిర్ణయాలు, ప్రభుత్వం పని చేస్తున్న తీరు అన్నీ సరిగ్గానే ఉన్నాయని వైసీపి చాటింపు వేసి మరీ ప్రజలకు తెలియజేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?




