అధికారంలో ఉన్నప్పుడు ఆ మదంతో రాజకీయ నాయకులు తప్పులు చేయడం పరిపాటి. కానీ ఒకసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి రెందోసారి ఘోర పరాజయం పాలైనప్పుడు తప్పకుండా ఎలాంటి నాయకుడికైనా కనువిప్పు కలగాలి. లేకుంటే ఆ అధినేత.. అయన నమ్ముకున్న నేతలు, కార్యకర్తలే నష్టపోతారు.
ఇదివరకు అంటే 2019 ఎన్నికలలో టీడీపి, జనసేనలు ఓడిపోయిన తర్వాత ఆ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ తప్పులు, లోపాలు గుర్తించి సరిచేసుకున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ప్రజలు, పార్టీ శ్రేణుల మద్యే ఉన్నారు. జగన్ ప్రభుత్వం వేధింపులు, అవహేళనలు అన్నిటినీ భరిస్తూనే ఎదురు నిలిచి పోరాడారు.
మళ్ళీ రెండు పార్టీలు చేతులు కలిపి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిని కూడా కలుపుకొని సర్వశక్తులు కూడగట్టుకొని పోరాడి గెలిచారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు.
ఇది అన్ని రాజకీయ పార్టీలకు సరిపడే ఫార్మాట్ అని అర్ధమవుతూనే ఉంది. కానీ ఆ రెండు పార్టీల అధినేతలపై అసూయ, ద్వేషం కారణంగా జగన్, కేసీఆర్ అహంభావం వలన వాటి నుంచి నేర్చుకునేందుకు ఇష్టపడటం లేదు.
కనుక ఇద్దరూ ప్రజలు తమలో ఏ మార్పు ఆశిస్తున్నారో తెలుసుకోకుండా, తమ ఆలోచనా విధానమే సరైనదని అనుకుంటున్నారు.
తమని ఎన్నుకోకుండా ప్రజలు ఒకసారి తప్పు చేసి బాధపడుతున్నారని వారు గట్టిగా నమ్ముతున్నారు. కనుక ఈసారి ప్రజలు మళ్ళీ ఆ తప్పు చేయరనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఈసారి మేమే అనగలుగుతున్నారు.
వారి ధైర్యానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల సమయానికి అనూహ్యమైనదేదో జరిగిపోయి, మళ్ళీ తాము అధికారంలోకి వచ్చేస్తామని ఒకరు ఫామ్హౌసులో, మరొకరు ప్యాలస్లో కలలు కంటున్నారు.
వారు ఆ భ్రమలో ఉండటమే మంచిదని కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంటే, ఇప్పటికైనా ఆ భ్రమలో నుంచి వారు మేల్కొని బయటకు వస్తే చాలని ఆ రెండు పార్టీల శ్రేణులు కోరుకుంటున్నాయి. కానీ మరో ఏడాది ఆగమంటున్నారు.




