సోమవారం నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం తొలిరోజున ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం మద్యాహ్నం 12 గంటలకు బీఏసీ కమిటీ సమావేశం జరుగుతుంది. దానిలో శాసనసభ షెడ్యూల్, అజెండా ఖరారు చేస్తారు.
తనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సమావేశాలకు రానని బెట్టు చేసి ఇంతకాలం మొహం చాటేస్తున్న వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రేపు శాసనసభ సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రేపు ఉదయం తాడేపల్లి ప్యాలస్కు రావాలని జగన్ ఆదేశించారు.
జగన్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అవతల 165 మంది ఉన్నారు. తనపై ప్రతీకారంతో రగిలిపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు తనని సభలో అవమానిస్తారనే భయంతోనే జగన్ మొహం చాటేస్తున్నారని అందరికీ తెలుసు.
కనుక ఇంతకాలం శాసనసభకు రానని మారాం చేసి ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో వస్తే టీడీపీ సభ్యులు ఎద్దేవా చేయకుండా ఉండరు. ప్రజలు నవ్వుకోకుండా ఉండరు. శాసనసభలో ఎలాగూ అవమానాలు తప్పకపోవచ్చు. పైగా ఇగో చంపుకొని సిఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ముందు నిలబడాలి. వారిని గౌరవించాలి.
కానీ శాసనసభకు రాకపోతే చట్ట ప్రకారం అనర్హత వేటు వేస్తామని సిఎం, స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ముగ్గురూ హెచ్చరించారు. అయినా మొండిగా శాసనసభకు హాజరవకుండా ఉండిపోతే మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులు కాపాడుకునేందుకు శాసనసభకు వెళ్తే జగన్ పరువు పోతుంది. వారు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంటుంది.
ఒకవేళ స్పీకర్ అనర్హత వేటువేస్తే హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయించినా అక్కడా వారికి మొట్టికాయలు పడతాయే తప్ప ఉపశమనం లభించదు.
కనుక జగన్తో పాటు ఆయనని నమ్ముకునందుకు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు.
అందుకే ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వకపోతే పాయే.. సభలో తలదించుకోవాల్సి వస్తే దించుకుందాం.. జనం నవ్వుకుంటే నవ్వనీ.. కనీసం ఎమ్మెల్యే పదవిని, 10 మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుందాము అని అనుకుంటూ గత్యంతరంలేక జగన్ రేపు శాసనసభకు వస్తున్నారనుకోవచ్చు.
కానీ జగన్ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే శాసనసభకు వస్తున్నారు కనుక సభలో ఈ అవమానకర పరిస్థితిని తప్పించుకునేందుకు గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే పారిపోయినా ఆశ్చర్యం లేదు.




