వైసీపీ అధినేత తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రావాలంటే పరామర్శించేందుకు మృతుల కుటుంబాలు అవసరమని కూటమి నేతలు విమర్శిస్తూనే ఉంటారు.
గత నెల 8న జగన్ ఈ పనిమీదే హెలికాఫ్టర్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్దికి వెళ్ళారు. అక్కడ హెలికాఫ్టర్ దిగగానే ఆయనకు స్వాగతం, జేజేలు పలికేందుకు సిద్దంగా ఉన్న వైసీపీ క్యాడర్ ముందుకు చొచ్చుకుపోయి హెలికాఫ్టర్ మీద పడ్డారు.
పోలీసులు జగన్కి దారి కల్పించేందుకు వారిని అదుపు చేయబోతే, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారిపైనే విరుచుకుపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆ తోపులాటలో హెలికాఫ్టర్ అద్దాలు పగలడంతో, తిరుగు ప్రయాణంలో జగన్ రోడ్ మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. పోలీసులు తనకు రక్షణ కల్పించడంలో విఫలమైనందునే ఈవిదంగా జరిగిందని, తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు రామగిరి ఎస్సై సుధాకర్ బట్టలూడదీయిస్తానంటూ హెచ్చరించారు కూడా.
చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఎటువంటి హడావుడీ చేయకుండా వెళ్ళి రావాలి.
కానీ జగన్ తాను పరామర్శకు వచ్చాననే విషయం మరిచినట్లు వందల మందితో ‘జై జగన్’ అని నినాదాలు చేస్తుంటే, చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ, జనాలకి అభివాదం చేస్తూ రోడ్ షో చేసుకుంటూ బాధిత కుటుంబం ఇంటికి వెళ్తారు. ఆత్మీయులను కోల్పోయిన బాధతో ఉన్న వారిని కూడా జగన్ చిక్కటి ఫిల్టర్ కాఫీ వంటి చిరునవ్వుతోనే పలకరిస్తుంటారు. ఇదేం పద్దతో?
కోడికత్తి, గులకరాయి కేసుల అనుభవంతో పాఠాలు నేర్చుకున్న సిఎం చంద్రబాబు నాయుడు, వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని టీవీలలో వచ్చిన ఈ న్యూస్ క్లిపింగ్స్, సీసీ కెమెరా రికార్డింగ్ అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలియగానే హెలికాఫ్టర్పై దాడి చేసిన వారిలో మరికొందరు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ పారిపోయారు. పోలీస్ బృందాలు వారి కోసం అక్కడకు వెళ్ళి గాలిస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయనపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారా? లేదా కార్యకర్తలలో వేరవరైనా జొరబడి జగన్పై దాడికి ప్రయత్నించారా? ఒకవేళ అక్కడ ఉన్నది వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఉంటే వారు హెలికాఫ్టర్పై ఎందుకు దాడి చేశారు?
తోపులాటలో ప్రమాదవశాత్తు హెలికాఫ్టర్ అద్దం పగిలిందా లేక ఉద్దేశ్యపూర్వకంగానే దాడి చేశారా? చేస్తే ఎందుకు చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కోడికత్తి, గులకరాయి కేసుల్లో చాలా హడావుడి చేసిన జగన్, వైసీపీ నేతలు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే కిక్కురుమనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
పరామర్శ పేరుతో శవ రాజకీయాలు చేయబోతే మరేదో జరుగుతోంది. దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ ఇలా తేడాగా ఉంటుందేమిటో!




