జగన్‌ ఓడిపోతారంటారా… అయితే ఎల్లో ముద్ర వేసేయాల్సిందే!

Prashant-Kishor-YS-Jagan-YSRCP

గత శాసనసభ ఎన్నికలలో వైసీపిని గెలిపించి, ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చినందుకు జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ని ఆప్యాయంగా కౌగలించుకొని ఆయన గొప్ప మేధావి అంటూ ప్రశంశించారు.

ADVERTISEMENT

ఇప్పుడు అదే నోటితో “ఆయన ఎవరు… ఎక్కడుంటారు… ఏం చేస్తుంటారు?” అంటూ ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆయన ఈసారి ఎన్నికలలో వైసీపి ఓడిపోబోతోందని, దానికి జగనే కారకుడని చెప్పడమే.

నిజానికి వైసీపికి బలమూ, బలహీనత రెండూ కూడా జగన్మోహన్‌ రెడ్డే అని అందరికీ తెలుసు. ఆయన వలననే ఈ ఎన్నికలలో తాము గెలవబోతున్నామని పార్టీలో అందరూ చెప్పుకుంటున్నారు కనుక ఒకవేళ ఓడిపోతే ప్రశాంత్ కిషోర్‌ చెప్పిన్నట్లు ఆయన వలననే వైసీపి ఓడిపోయిందని కూడా అంగీకరించక తప్పదు కదా?

ప్రశాంత్ కిషోర్‌ తమ పార్టీకి పనిచేయకపోయినా జగన్‌ బాధపడలేదు కానీ తన వలననే ఎన్నికలలో వైసీపి ఓడిపోబోతోందని చెప్పడంతో జగన్‌ చాలా హర్ట్ అయ్యారని సాక్షి మీడియాలో ప్రశాంత్ కిషోర్‌ని తప్పు పడుతూ వస్తున్న కధనాలు చూస్తే అర్దమవుతుంది.

పిల్లి మెడలో ఎవరు గంట కడతారన్నట్లు ఇన్నేళ్ళుగా వైసీపిలో ఏ ఒక్కరూ ధైర్యం చేసి ‘మన సంక్షేమ విధానం సరి కాదని’ తమ అధినేత జగన్‌కు చెప్పలేకపోయారు. అలా చెప్పడానికి ప్రయత్నించిన కోటంరెడ్డి, ఆనం రెడ్డి, మేకపాటి వంటి వారిని శ్రేయోభిలాషులుగా గుర్తించి వారి మాటలను చెవికెక్కించుకొని ఉండి ఉంటే నేడు వైసీపి పరిస్థితి మరోలా ఉండేది. కానీ వారిపై ‘ఎల్లో ముద్ర’ వేసేసి మెడ పట్టుకొని బయటకు గెంటేశారు. అది చూసి వైసీపిలో ఎవరూ జగన్‌కి సలహా ఇచ్చే ధైర్యం చేయలేదు.

ఆనాడు మహాభారతంలో దుర్యోధనుడికి భీష్మ ద్రోణాచార్యులు వంటి కురువృద్ధులు, విదురుడు, చివరికి శ్రీకృష్ణుడు అంతటివాడు కూడా ‘నువ్వు ఎంచుకున్న మార్గం సరికాదని’ నచ్చజెప్పారు. కానీ శ్రేయోభిలాషులైన వారందరినీ శత్రువులుగా భావిస్తూ, తన పక్కనే ఉంటూ కురువంశాన్ని నాశనం చేసిన శకుని, శల్యుడు వంటి శత్రువులను శ్రేయోభిలాషులుగా భావించాడు. అలా వారిని నమ్మి యుద్ధం చేసినందుకు దుర్యోధనుడు, ఆయనను నమ్మి యుద్ధం చేసినందుకు వారందరూ బలయ్యారు. వైసీపిలో కూడా ఇప్పుడు అదే విదంగా జరుగబోతోంది.

ప్రశాంత్ కిషోర్‌ కూడా జగన్మోహన్‌ రెడ్డికి ఏడాది క్రితం ఓ శ్రేయోభిలాషిగానే సలహా చెప్పారు. అభివృద్ధిని విస్మరించి, సంక్షేమ పధకాలతో ముందుకు సాగడం వలన నష్టపోతావని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్‌ ఇచ్చిన ఆ సలహాపై అప్పుడే జగన్‌ ఓసారి తన మంత్రులు, సీనియర్ నేతలతో కూర్చొని ‘మన విధానం, ధోరణి’ సరైనవా కావా?అని చర్చించి ఉండి ఉంటే నేడు వైసీపి పరిస్థితి మరోలా ఉండేది.

కానీ ఆనాడు జగన్‌ ‘అందరూ నన్ను నమ్మి చొక్కా మడత పెట్టి యుద్ధానికి సిద్దం కమ్మనమని చెప్పి యుద్ధం చేయించారు. వారికి వేరే దారి లేదు కనుక ‘నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్‌ జగన్’ అనుకుంటూ ఈ యుద్ధంలో పాల్గొన్నారు.

కనుక ఈ యుద్ధంలో గెలిచినా, ఓడినా అందుకు జగనే కారకుడు. ఈ యుద్ధంలో ఓడిపోతే ఆయనతో పాటు అందరూ మూల్యం చెల్లించక తప్పదు.

జగన్‌ ఆలోచన ధోరణి, విధానాల వలననే ఈ యుద్ధంలో వైసీపి ఓడిపోబోతోందని చెప్పడం తప్పుగా అనిపించవచ్చు. ఇలా అన్నందుకు ఎల్లో స్టాంప్ వేసేయవచ్చు. కానీ పక్కనే ఉండి ఓడించే శకుని, శల్యుడు కాదు… కానీ ఓటమి గురించి ముందే హెచ్చరించిన ప్రశాంత్ కిషోర్‌ వంటివారే శ్రేయోభిలాషులు అని గ్రహించలేకపోవడం తప్పు. కురుక్షేత్రంలో దుర్యోధనుడి పాత్ర పోషిస్తూ తాను పద్మవ్యూహం ఛేదించగల అర్జునుడినని జగన్‌ అనుకోవడం మరో విచిత్రమే కదా?

ADVERTISEMENT
Latest Stories