ఈ నెల 18 నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. కనుక ఎప్పటిలాగే వైసీపీ నేతలు జగన్కు ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా’ పాట మొదలుపెట్టేశారు. అంటే ఈసారి కూడా జగన్ శాసనసభ సమావేశాలకు రారని చెప్పేసినట్లే!
దీనిపై ఉండి ఎమ్మెల్యే, శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు స్పందిస్తూ, “జగన్ ఇలాగే చంటి పిల్లాడిలా… శాసనసభ సమావేశాలకు రాను రాను అంటూ మారం చేస్తుంటే పులివెందులకు ఉప ఎన్నికలొస్తాయి. శాసనసభ్యులు వరుసగా 60 రోజులు హాజరుకాకపోతే వారి శాసనసభ్యత్వం రద్దు అవుతుంది.
అప్పుడు జగన్కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కాదు గదా ఈ ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు. అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు.
కనుక ఈసారైన జగన్ ధైర్యంగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి తన నియోజకవర్గం, తన పార్టీకి ఓట్లు వేసిన 40 శాతం ప్రజల తరపున మాట్లాడితే బాగుంటుంది.
ఉప సభాపతిగా నేను ప్రతిపక్ష నేత శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నాను. కానీ అయన ఉప ఎన్నికలే కోరుకుంటే వద్దనలేము కదా?” అని అన్నారు.
జగన్ అమరావతి రాజధానిగా వద్దనుకున్నారు. దాని అసలు కారణం చంద్రబాబు నాయుడుపై ద్వేషమే. కానీ వేరే స్టోరీలు చెప్పేవారు.
ఇప్పుడు శాసనసభ సమావేశాలకు రాకూడదని నిర్ణయించుకున్నారు. వస్తే సభలో అవమానిస్తారని భయపడుతున్నారు. కనుక ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా’ ఇస్తేనే వస్తానంటూ మొహం చాటేస్తున్నారు.
సభలో అవమానాలు భరించడం కష్టమని మొహం చాటేస్తున్న జగన్కి ఒకవేళ ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా’ ఇచ్చినా వస్తారా?అంటే అనుమానమే. ఎందుకంటే ఆయన మొహం చాటేయడానికి ‘హోదా’ అసలు కారణం కాదు కనుక!
అయితే ఈ కారణంగా అయన సభ్యత్వం రద్దు చేసే అవకాశం కూటమి ప్రభుత్వానికి ఉన్నప్పుడు, మొబైల్ ఫోన్లో రీ ఛార్జ్ చేసుకోమని వారం పదిరోజుల ముందుగానే గుర్తుచేస్తున్నట్లు, ఈ విషయం ఆయనకు ఎందుకు గుర్తుచేస్తోంది? చేసి అయన మరిచిపోకుండా హాజరువేసుకొని పోయేలా ఎందుకు తోడ్పడుతోంది?అనే సందేహం కలుగుతుంది.
జగన్ ఈవిదంగా కుంటిసాకుతో శాసనసభ సమావేశాలకు రాకుండా మొహం చాటేస్తుంటే, కూటమి మంత్రులు, నేతలు ఈవిదంగా విమర్శిస్తూ జగన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చని భావిస్తున్నట్లున్నారు. బహుశః అందుకే జగన్ ఎమ్మెల్యే పదవి ఊడిపోకుండాని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారేమో?





