ముంజేతి కంకణం చూసుకునేందుకు అద్దం ఎందుకన్నట్లు, జగన్ సంక్షేమ పధకాల కోసం చేసిన అప్పులు లక్షల కోట్లు ఉంటాయని ఎవరో చెప్పక్కరలేదు. కానీ కలశంలో పోస్తేనే నీళ్ళు తీర్ధం అవుతాయన్నట్లు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పిందే ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుంది.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై నిన్న శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ, గత 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు. ఇవి ఇప్పటి వరకు లెక్కగట్టినవి మాత్రమే అని ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు.
కాంట్రాక్టర్లు, ఆరోగ్యశ్రీ ఇంకా పలువురికి దాదాపు రూ.1.35 లక్షల కోట్లు బిల్లులు చెల్లించకుండా జగన్ నామం పెట్టి వెళ్ళిపోయారని ఆక్షేపించారు. ఒక విధానమంటూ లేకుండా దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ జగన్ ఆర్ధిక విధ్వంసం సృష్టించారని అన్నారు. చివరికి రైతు బజార్లు, ప్రభుత్వం కళాశాలలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేశారని అన్నారు.
ఇవికాక రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం పనులు నిలిపివేయడం వలన మరో రూ.55,000 కోట్లు, అదేవిదంగా అమరావతిని పాడుబెట్టడం వలన మరో రూ.2-3 లక్షల కోట్లు నష్టం జరిగిందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఈ అప్పులు వాటిపై వడ్డీల చెల్లింపుకే ఏడాదికి రూ.71,881 కోట్లు చెల్లించాల్సి వస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఈ అప్పుల ఊబిలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయట పడేయడానికి చాలా కాలమే పడుతుందని, ఇది అభివృద్ధిపై ఎక్కడ ప్రభావం చూపుతుందో అని ఆందోళన చెందుతున్నాని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో రోడ్లు వేయించాలని అడిగితే ‘ఇప్పుడు కాదని’ తిప్పి పంపించవలసి వస్తోందని సిఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల హామీలు అమలుచేయకుండా తప్పించుకోవడానికే చంద్రబాబు నాయుడు అబద్దాలు చెపుతున్నారు,” అని ఆరోపించారు.
కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో రోడ్లకు మరమత్తులు చేయించలేకపోయారు కదా?ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలు, పంచాయితీలకు ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం వలన విద్యుత్ సిబ్బంది వచ్చి ఫ్యూజులు తీసుకుపోయేవారని పేపర్లలో ఎన్నిసార్లు వార్తలు రాలేదు?
ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించలేకపోతే వారు రోడ్లపై ధర్నాలు చేసేవారు కదా? వారు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ముని కూడా తీసి వాడేసుకున్నారు కదా? అంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అప్పటికే దయనీయంగా మారిందని స్పష్టమవుతోంది. అదే ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు కూడా చెపుతుంటే జగన్ ఎలా కాదనగలరు?




